YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కధువా ఘటన లాయర్ సంచలన వ్యాఖ్యలు

కధువా ఘటన లాయర్ సంచలన వ్యాఖ్యలు

కథువాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో బాలిక కుటుంబం తరఫున వాదిస్తున్న లాయర్ దీపికా రాజావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కూడా రేప్ చేసి, హత్య చేస్తారేమోనని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. తనకు తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరనున్నట్లు దీపికా చెప్పారు. నేను ఎన్ని రోజులు బతికుంటానో నాకు తెలియదు. నన్ను కూడా రేప్ చేసి చంపేయొచ్చు. నాపై దాడి జరగొచ్చు. నిన్ను ఎప్పటికీ క్షమించం అంటూ నాకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను ప్రమాదంలో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు చెబుతా అని దీపికా అన్నారు. తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉండటంతో కేసు విచారణను చండీగఢ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ పాప తండ్రి ఇవాళ సుప్రీంకోర్టును కోరారు. కథువాలో విచారణకు అనుకూల వాతావరణం లేదు అని దీపికా చెప్పారు. ఈ దారుణ ఘటనపై దేశమంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేప్, హత్య కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఆ పాపను కిడ్నాప్ చేసి ఓ గుడిలో బంధించి కొన్ని రోజుల పాటు అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కథువా గ్యాంగ్‌రేప్‌లో మాజీ రెవెన్యూ అధికారి సాంజీరామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జనవరి 10న ఈ ఘటన జరగగా.. అదే నెల 17న ఆ పాప మృతదేహం దొరికింది. అయితే ఆ తర్వాత ఈ రేప్ కేసుకు మతం రంగు పులుముతూ హిందూ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

Related Posts