హైదరాబాద్ అక్టోబర్ 17
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజేంద్రనగర్ పరిధిలోని అప్ప చెరువుకు గండి పడిన విషయం తెలిసిందే. దీంతో 44వ జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ తర్వాత అధికారులు మరమ్మతులు చేపట్టి రహదారిని పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఇవాళ 44వ జాతీయ రహదారితో పాటు అప్ప చెరువును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి శాఖతో సమన్వయం చేసుకుని తెగిన చెరువు కట్టకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులో అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపైన ప్రధాన దృష్టి సారించి పని చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరం... ప్రాణ నష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పిస్తున్నది అని కేటీఆర్ తెలిపారు.