YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

100 శాతం ఆక్యుపెన్సీ కుదరదు

100 శాతం ఆక్యుపెన్సీ కుదరదు

సినిమా ప్రదర్శనల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా హాళ్లకు, మల్టీప్లెక్సులకు 50 శాతం ప్రేక్షకులతో మాత్రమే సినిమా ప్రదర్శనలు అనుమతిచ్చామని తెలిపింది. ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించామని గుర్తు చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా తమకు అనుగుణంగా మార్చుకోరాదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం తీసకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర హోం శాఖ స్పందించింది.సినిమా థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత తెలుపుతూ చాలా మంది గళమెత్తారు. సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌కు చెందిన కొంత మంది ప్రముఖులు కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. తాజాగా ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు.దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోందని, దీనికి తోడు కరోనా కొత్త వైరస్‌ స్ట్రెయిన్ కేసులు కూడా నమోదవుతున్నాయని.. ఇలాంటి తరుణంలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడం సమంజసం కాదని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని సూచించారు.తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం కేంద్రం డిసెంబరు 28న జారీ చేసిన కొవిడ్‌-19 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని కేంద్ర హోం శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 100 శాతం సీటింగ్‌తో సినిమా ప్రదర్శనల ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, తమ ఆదేశాన్ని పాటించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు.తమిళనాడులో సినిమా హాళ్లలో సీటింగ్ కెపాసిటీని 100 శాతానికి పెంచడాన్ని అరవింద్ స్వామి వ్యతిరేకించారు. అలనాటి నటి, ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన ఖుష్బూ తమిళ సర్కార్ నిర్ణయానికి మద్దతు పలికారు.పుదిచ్చేరికి చెందిన ఒక వైద్యుడు 100 శాతం సీటింగ్ అవకాశాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టును ట్యాగ్ చేస్తూ కొందరు తమిళ సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టారు.టాలీవుడ్‌లోనూ 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కరోనా లాక్‌డౌన్‌తో బాగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. సంక్రాంతి పండుగ నుంచి మళ్లీ బిజినెస్ పుంజుకుంటుందని నిర్మాతలు, సినిమా థియేటర్ల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 13న హీరో విజయ్ నటించిన 'మాస్టర్' విడుదల కానుంది. రవితేజ నటించిన క్రాక్, శింబు నటించిన ఈశ్వరన్‌ సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి.

Related Posts