
చెన్నై జనవరి 23
కరోనా బారిన పడిన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ నిమోనియా జ్వరం, తీవ్ర రక్తపోటు తదితరాల లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకవైపు చికిత్స అందిస్తున్నా రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే వుంది. దీంతో ఆమె సత్వరం కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలంటూ ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ (ఏఎంఎంకే) కార్యకర్తలతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా పలు చోట్ల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. ఎప్పటికప్పుడు చిన్నమ్మ ఆరోగ్య వివరాలు తెలుసుకుంటూ ఆమె కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుదల కావాల్సిన శశికళ.. ఆ రోజున చెన్నై రావడం అనుమానమేనని ఏఎంఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే ఈ లోగా వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం, దగ్గుతో బాధ పడుతున్న ఆమె మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. జైలులోని ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో శివాజీనగర్లోని బౌరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ మొదట్లో జ్వరం తగ్గినా దగ్గు క్రమేణా పెరిగింది. జైలు నుంచి ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆక్సిజన్ శాతం 74గా వుండగా, ఆ తరువాత 89 శాతానికి పెరిగింది. అయితే బుధవారం రాత్రికి ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూకి తరలించారు. అక్కడ గురువారం మధ్యాహ్నానికి కోలుకున్నట్లు కనిపించినా, మళ్లీ జ్వరం, దగ్గు తీవ్రమయ్యాయి. దీంతో అనుమానించిన వైద్యులు విక్టోరియా ఆస్పత్రికి తరలించి అక్కడ సీటీ స్కాన్ చేయించారు.