YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై కొనసాగుతోన్న నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోవని తెలిపింది. ప్రపంచంలో  కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి రాకపోవడంతో  విమాన ప్రయాణాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గో విమానాలు డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన ఇతర విమాన సర్వీసులకు మాత్రం అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొవిడ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో గురువారం డీజీసీఏ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను 2020 మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. కాగా వందే భారత్ మిషన్లో భాగంగా మే నుంచి ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తున్నారు.  అమెరికా యుకె యుఏఇ కెన్యా భూటాన్ ఫ్రాన్స్తో సహా 24 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాలను చేసుకుని సర్వీసులను కొనసాగిస్తోంది.  దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభిస్తారని అందరూ భావించారు. అయితే.. యూకేలో కొత్త రకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై మరొక నెల రోజుల పాటు నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.


ఇక దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 165కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. గురువారం జరిగిన మంత్రుల బృంద సమావేశంలో ఆయన దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. యూకే స్ట్రెయిన్ కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Related Posts