హైద్రాబాద్, ఫిబ్రవరి 4,
అగ్నిమాపక నిబంధనలు పాటించని ప్రయివేటు ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నది. ఎన్ఓసీ లేని ఆస్పత్రుల లైసెన్స్ను రద్దు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అడ్డగోలు అనుమతులిచ్చిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. వేల సంఖ్యలో ప్రయివేటు ఆస్పత్రులు అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడంలేదని.. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్నది కథనం సారాంశం. ఈ విషయమై వైద్యఆరోగ్యశాఖకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారం రోజుల క్రితం లేఖ రాసింది. ప్రతిశాఖలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ప్రత్యేకంగా పైర్సేఫ్టీపై ఉత్తరాలు రాస్తూ సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తారు. ఇందులో భాగంగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వైద్యశాఖ అధికారులకు లేఖ రాశారు. కొంతమంది అనినీతి అధికారులు జిల్లాల్లో ఎన్ఓసీలు లేని ఆస్పత్రులకూ లైసెన్స్, రెన్యువల్స్ చేసేస్తున్నారని.. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే సంబంధిత డీఎంహెచ్ఓనే బాధ్యుల్ని చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై విజిలెన్స్ విభాగం త్వరలో ఆకస్మిక తనిఖీలు చేయనుంది. ఎన్ఓసీ లేని ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేయనున్నారు. రాష్ట్రంలో చిన్న, పెద్ద ఆస్పత్రులు కలిసి సుమారు 5 వేలకు పైగా ఉంటాయని అంచనా. ఇందులో ఫైర్సేఫ్టీ పొందినవి కేవలం 500లోపే ఉండటం విశేషం. మిగిలినవి యథేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని అగ్నిమాపక అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రయివేటు ఆస్పత్రులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. 1999 ఫైర్ చట్టం సెక్షన్ 121 ప్రకారం 15 మీటర్ల కలిగి ఉన్న వ్యాపార సంబంధ బహుళ అంతస్తుల భవనాలలు కచ్చితంగా అగ్నిమాపక అధికారుల నుంచి ఫైర్సేఫ్టీ సర్టిఫికేట్ను పొందాల్సి ఉంటుంది. అంతకు తక్కువ ఉన్న భవనాలు నర్టిఫికేట్ను తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా గృహసంబంధ నిర్మాణాలకు సంబంధించి 18 మీటర్లు కలిగి ఉన్న భవనాలు ఖచ్చితంగా ఫైర్సేఫ్టీ సర్టిఫికేట్ను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఆస్పత్రులు బహుళ అంతస్తుల భవనాల్లో నిబంధనలకు నీరుగారుస్తూ వెలుస్తున్నాయి. కనీస సౌకర్యాలు సైతం లేకుండా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఫైర్సేఫ్టీపై అగ్నిమాపక శాఖ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆయా భవనాల్లో ఫైర్సేఫ్టీ ఉందా? వేటికి లేదో ఖచ్చితంగా నిర్ధారించాలి. అప్పుడు మాత్రమే భవనం నిర్మించాలి. కానీ నగరంలో ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇక ప్రభుత్వాస్పత్రులను పరిశీలిస్తే పైర్సేఫ్టీ అంటే ఏమిటో అన్నట్టుగా కనిపిస్తున్నది. నగరంలో వేలాది మంది చికిత్స పొందే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లోనూ పైర్సేఫ్టీ లేనట్టు అధికారులు గుర్తించారు. కనీసం సిఓ2 సిలిండర్లను కూడా సరిగ్గా సమకూర్చడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా భవనం కింది భాగంలో 70 వేల లీటర్ల నీటి ట్యాంకును, పై భాగాన 30వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేయాలి. ఈ నీళ్లను నిరంతరం పైపుల ద్వారా సరఫరా చేస్తుండాలి. ఆరు నెలలకోసారి అగ్నిప్రమాదాలపై మాక్డ్రిల్ను నిర్వహించి, అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగినపుడు సిబ్బంది, రోగులు సులభంగా బయటకు వచ్చేందుకు భవనానికి ఇరువైపులా రెండు మెట్లమార్గాన్ని ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి కాబట్టి.. ప్రతి భవనంలో జనరేటర్ను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. భవనాలపైన నీటి ట్యాంకర్లను నిర్మించుకోవాలి. ప్రతి అంతస్తుకు నీటిని అందించే పైవును ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి బయట నుంచి కూడా పొడవైన పైవులను ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా వెలుపలి నుంచి భవనానికి అన్ని వైవులా నీళ్లు చిమ్మేందుకు వీలవుతుంది. ఏది ఏమైనా ఇలాంటి ఆస్పత్రులపై వెంటనే చర్యలు చేపట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.