YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రత్యక్ష దైవం

ప్రత్యక్ష దైవం

దైవము కంటికి కనిపించడు..కదిలే కాలము కంటికి కనిపించదు. అయితే.. కనిపించని కాలాన్ని మనకు తెలియచెప్పేది.. ఆ కనిపించని దైవమే. అదే.. కాలానికి, దైవానికి ఉన్న అవినాభావ సంబంధం. మరి.. ఆ దైవం ఎవరు ?  ఇంకెవరు? సూర్యభగవానుడే. ఆయన కదలికే కాలం కదలిక. అందుకే.. సూర్యుని ‘ప్రత్యక్షదైవమ్’ అన్నారు. ఇది నిరంతర ప్రయాణం. మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా. ఉంది. ఏమిటా గమ్యం? జననం నుంచి..జననం అనే గమ్యానికి చేరడమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం. ఇదేమిటి? జననానికి మరణమేకదా చివరి గమ్యం? అనే ప్రశ్న మీకు కలుగవచ్చు. మరణమే.. చివరి గమ్యమైతే అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగిపోయినట్టే. మరి కాలం ఆగదు కదా. 
జననానికి..మరణం ఓ మజిలీ మాత్రమే. ఇక్కడే.. మీరు నిశితంగా పరిశీలించాలి. జన్మించిన జీవి..మరణించి, మరో జీవిగా జన్మించి.. ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే.. ఈ ప్రయాణం, మరణం అనే మజిలీ గుండా సాగుతుంది. అంతే. ఈ కాలరథానికి సారధి ‘సూర్యుడు’. ఎందుకంటే... జీవికి..ఉత్పత్తి, ఎదుగుదల, నాశనము అనే మూడు దశలు ఉన్నట్టే..సూర్యునకు ఉదయము, పూర్ణవికాసము, అస్తమయము అనే మూడు దశలు ఉన్నాయి. బాలభానుడుగా ఉదయించిన సూర్యుడు..మధ్యాహ్నానికి పూర్ణవికాసుడై.. సాయంకాలానికి అస్తమిస్తాడు. నిజానికి సూర్యునకు అస్తమయం ఉందా.. లేదే. ఇక్కడ ఆయన అస్తమయం..మరొకచోట ఉదయానికి నాంది. అంతే. అలాగే.. జీవికి మరణం.. మరోచోట జననానికి నాంది. అందుకే అస్తమయం లేని సూర్యుడు..జననం నుంచి జననం అనే గమ్యానికి చేర్చే సారధి అయ్యాడు. జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియచెప్పడమే.. 
ఆయన ఉదయ, మాధ్యాహ్నిక, సాయం సంధ్యల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే., ఈ త్రిసంధ్యలలో సూర్యుని ఉపాసించాలి అనే నియమాన్ని మనకు ఏర్పాటు చేసారు మన ఋషులు.
సూర్యోపాసన వల్ల తేజస్సు, బలము, ఆయువు, ఆరోగ్యము వృద్ధిపొందుతాయి. అంతేకాదు.. జన్మించిన జీవి.. మరోజన్మ అనే గమ్యం చేరాలంటే ‘మరణం’ అనే మార్గం గుండానే వెళ్లాలని చెప్పాను కదా. ఈ మరణమార్గం సూర్యలోకం గుండానే సాగుతుంది. మరల జన్మే లేకపోతే..కాలం ప్రయాణం ఆగదుకానీ.. జీవికి, ప్రయాణం ఆగిపోతుంది. అదే ‘మోక్షం’.
ఆ మోక్షమార్గమే..పరమాత్ముని సన్నిదికి చేర్చే ‘పరమపద సోపాన మార్గం’. జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియచెప్పడమే.. సూర్యగమనంయొక్క సారాంశం. అందుకే..ఆ ప్రత్యక్షదైవాన్ని త్రిసంధ్యలలోనూ ఉపాసించాలి. అదే.మనం చేసే ఈ జనన, మరణ ప్రయాణానికి మనం చెల్లించే ప్రయాణ మూల్యం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts