YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలోనూ సోషల్ ఇంజనీరింగ్...

తెలంగాణలోనూ సోషల్ ఇంజనీరింగ్...

హైదరాబాద్, ఫిబ్రవరి 23,
తెలంగాణ రాజకీయాల్లో కులాల ప్రస్తావన, ప్రాధాన్యం తక్కువ. కానీ పార్టీలు మాత్రం సామాజికవర్గాలపై ఫోకస్ పెడుతున్నాయి. ఓ బీసీ సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కులాలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇక్కడ మొదటి నుంచి రెడ్లు, వెలమల ఆధిపత్యం ఉన్నప్పటికీ.. సామాజిక వర్గాలకు అతీతంగా ఇక్కడి రాజకీయాలు సాగుతాయి. కానీ తెలంగాణలోనూ మెల్లగా సామాజికవర్గాల కోణంలో రాజకీయాలు చేయడం మొదలైంది. ఏపీ స్థాయిలో కులాభిమానం ఇక్కడ లేకపోయినా.. రాజకీయ పార్టీలు మాత్రం సామాజిక వర్గాల కోణంలో ఆలోచిస్తున్నాయి.తెలంగాణ జనాభాలో సగం వాటా బీసీలదే. బడుగు వర్గాలు ఎటు మొగ్గితే అధికారం ఆ పార్టీదే. ఈ విషయం తెలుసు కాబట్టే పార్టీలు బీసీలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి. బీసీల్లోనూ జనాభాపరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల వైపు తెలంగాణలోని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి.వాస్తవానికి కాపుల ప్రాబల్యం ఆంధ్రాలో ఎక్కువ. ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి అనే రెండు బలమైన సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ.. కాపుల జనాభా ఎక్కువ. దీంతో అక్కడి పార్టీలు కాపులను మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ విషయానికి వస్తే బీసీ జాబితాలో ఉండే మున్నూరు కాపుల జనాభా కూడా ఎక్కువే.
తెలంగాణ రాజకీయ పక్షాలు మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ ఈటల, కే కేశవరావుకు మొదటి నుంచి తగిన ప్రాధాన్యం ఇస్తోంది. బీజేపీ తెలివిగా తెలంగాణ అధ్యక్ష పదవిని ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కట్టబెట్టింది. ధర్మపురి అరవింద్, గతంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన లక్ష్మణ్‌ది సైతం ఇదే సామాజిక వర్గం. మున్నూరు కాపులను ఆకట్టుకోవడంతోపాటు.. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడి సెటిలైన కాపులు, తెలంగాణలోని బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది.మున్నూరు కాపులను తమవైపు తిప్పకోవడం కోసం కాషాయ పార్టీ వ్యూహాలను పసిగట్టిన టీఆర్ఎస్ సైతం అందుకు తగ్గటుగానే ప్రతి వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్‌లో ఇంటా బయట పోరుకు చెక్ పెట్టడం కోసం ఇదే సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి అప్పగించింది. నిజామాబాద్‌లోనూ ఈ వర్గానికే చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.గత జీహెచ్ఎంసీ మేయర్‌గా ఈ సామాజిక వర్గానికి చెందిన బొంతు రామ్మోహన్‌ను కేసీఆర్ ఎంపిక చేశారు. అప్పుడు ఆయనకు ఆ పదవి దక్కడానికి ఉద్యమ నేపథ్యమే ప్రధాన కారణం. కాగా 2021లో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మిని ఎంపిక చేశారు. ఈమె సైతం మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. కేకే కూతురు కావడం.. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతోనే ఆమెకు ఈ పదవి దక్కింది. వాస్తవానికి ఈ పదవిని రెడ్డి సామాజికవర్గానికి అప్పగించాలని తొలుత భావించారట. ఇలా.. అధికార టీఆర్ఎస్, బీజేపీ బీసీలను ముఖ్యంగా మున్నూరు కాపులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Related Posts