YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

1000 ఎకరాలు మాయం...

 1000 ఎకరాలు మాయం...

హైదరాబాద్, ఫిబ్రవరి 26, 
హైదరాబాద్‌ నడిబొడ్డున వేయి ఎకరాలను మింగేశారు. వేయి ఎకరాలున్న ప్రాంతం.. అదీ హైదరాబాద్‌ నడిబొడ్డున ఎక్కడుందని అంటారేమో. కాని, మింగేశారు. ఇది నిజం. కాకపోతే, అదంతా ఆక్రమణేనా అన్నది మాత్రం తెలుసుకోలేరు. హుస్సేన్‌ సాగర్‌ పరిధి ఎంత అని అడిగితే.. ట్యాంక్‌బండ్‌ను చుట్టేసి ఇదీ దాని చుట్టుకొలత అని చెబుతాం. కాని, ఇప్పుడున్న సెక్రటేరియట్‌ను హుస్సేన్‌ సాగర్‌లో కట్టారని తెలుసా. లుంబినీ పార్క్, ఐమ్యాక్స్‌ థియేటర్‌ సాగర్‌ను ఆక్రమించి కట్టారంటే నమ్ముతారా. అసలు నెక్లెస్‌ రోడ్‌, జలవిహార్‌, ఈట్‌ బజార్‌ అన్నీ హుస్సేన్‌ సాగర్‌ను పూడ్చి కట్టినవే. కాకపోతే, ఓ చల్లని సాయంత్రం వేళ.. ఆహ్లాదం కోసం హుస్సేన్‌ సాగర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేసి వచ్చే వారికి ఇవేమీ తెలీవు. నిజాం తవ్వించినప్పుడు హుస్సేన్‌ సాగర్‌ విస్తీర్ణం 1400 ఎకరాలు. ఇప్పుడు 900 ఎకరాలు ఉందని.. కాదు కాదు 400 ఎకరాలు ఉందని చెబుతున్నారు. అంటే, దాదాపు వెయ్యి ఎకరాలు మాయమయ్యాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే భారీ మంచినీటి జలాశయం హుస్సేన్‌ సాగర్. 1562లో కులీ కుతుబ్ షా నిర్మించారు. ఈ చెరువు మొత్తం క్యాచ్‌మెంట్ ఏరియా 240 చరరపు కిలో మీటర్లుమొత్తం వాటర్ స్ప్రెడ్ ఏరియా 5.7చదరపు కిలోమీటర్లు. సరాసరి లోతు 15 అడుగుల పైమాటే. ఇంతటి ఘనత ఉన్న హుస్సేన్‌ సాగర్‌ను ప్రమాదకర చెరువుగా మార్చేశారు. అక్కడితో ఆగలేదు. కొలతలు చెరిపేసి.. కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ వచ్చారు. ఈ ఆక్రమణలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హుస్సేన్‌సాగర్‌ కబ్జా మరోసారి చర్చనీయాంశం అయింది.  సాగర్‌ను అందంగా చూపించడం కోసం.. కొద్దికొద్దిగా నాశనం చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నెక్లెస్‌ రోడ్‌ హుస్సేన్‌ సాగర్ కొంపముంచింది. మెల్లమెల్లగా నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఆ అక్రమ నిర్మాణాలకు నెక్లెస్‌ రోడ్డే రక్షణగా నిలుస్తూ వచ్చింది. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే సంజీవయ్య పార్కులో సైతం నిర్మాణాలు చొచ్చుకొస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఆక్రమణల వేగం మరింత పెరిగింది.ఎన్టీఆర్ ఘాట్ , పీవీ ఘాట్, లుంబిని పార్క్, లేజర్ షో, ఐమాక్స్, జలవిహార్, ఈట్ బజార్ ఇవన్నీ హుస్సేన్‌ సాగర్‌లోనే కట్టారు. పీపుల్స్ ప్లాజాను కట్టించిన ప్రభుత్వం.. దాన్ని ఆదాయ వనరుగా చూస్తుంది. నిజానికి ఈ కట్టడాలన్నీ చట్టవిరుద్ధం. హుస్సేన్ సాగర్ రక్షణ కోసం వేసిన రాజమణి కమిటి.. ఆక్రమణలను తొలగించాలని, కాలుష్యనివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. కాని, ఏ ప్రభుత్వం కూడా వీటిని పట్టించుకోలేదు.ఇప్పటికీ హుస్సేన్‌ సాగర్‌ను ఆక్రమణదారులు వదలడం లేదు. నెక్లెస్‌రోడ్‌ వైపు ఓ ప్రైవేట్ సంస్థ భారీ లేఔట్ తయారు చేసి నిర్మాణాలు ప్రారంభించింది. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో.. హైకోర్టుకెళ్లారు సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఈ కేసు వచ్చే ఏప్రిల్‌ ఒకటిన మళ్లీ విచారణకు రానుంది.మరోవైపు సాగర్‌ అక్రమాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు సార్వత్‌. నోటీసులు రావడంతో కొద్ది రోజుల క్రితం హుస్సేన్ సాగర్ పరిధిలో 6 జేసీబీలు, 30 మంది సిబ్బందితో తూతూమంత్రంగా కూల్చివేతలు ప్రారంభించి వదిలివేశారు. హుస్సేన్‌ సాగర్‌కు పూర్వవైభవం రావాలంటే ఆక్రమణలను పూర్తిగా తొలగించాల్సిందే. ముందు.. హుస్సేన్‌ సాగర్‌ను ఆదాయ వనరుగా చూడడం మానేయాలంటున్నారు.కబ్జాలతోపాటు సాగర్‌ను క్లీన్‌గా ఉంచినప్పుడే జంటనగరాలాకు జల భాండాగారంగా మిగులుతుందని, లేదంటే రానురాను స్వరూపాన్ని కోల్పోయి మురుగు గుంటగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్‌ సాగర్‌లో ఆక్రమణలు తొలగించాలంటూ సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ హైకోర్టుకు లేఖ రాశారు. లెటర్‌ను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు.. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

Related Posts