YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భవబంధాలు

భవబంధాలు

*ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే, అసత్యాలే..*
*చిన్న కథ...*
*ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ ప్రవచనం పూర్తి కాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చాడు.*
*"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావు..!" అన్నాడు సాధువు. " అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్ఛాడు సాధువు." ఎలా స్వామీ..?" అడిగాడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను. నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పాడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయాడు.*
*అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించారు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించారు. నేను దాన్నిని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసాను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.*
*మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు.*
*సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.*
*ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరి కదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు.*
*ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. "మహాత్మా..!నేను ఈ అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మ తోటిది మాత్రమే అని గ్రహించాను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయాడు.*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts