YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

దావోస్‌లో చంద్రబాబుతో కేటీఆర్ భేటీ

దావోస్‌లో చంద్రబాబుతో కేటీఆర్ భేటీ

ప్రపంచ ఆర్థిక సదస్సు‌లో పాల్గొనేందుకు ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

మంత్రి లోకేష్‌కు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా కేటీఆర్‌ను కలిసి సరదాగా ఫోటోలు దిగారు. కాగా, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో అన్ని దేశాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో సహా తెలంగాణ, ఏపీ నుంచి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. 

‘ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు’’

ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు రెండు రోజు కార్యక్రమాల్లో బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం ప్యానెల్ డిస్కషన్‌లో మంత్రి లోకేష్ మాట్లాడారు. 

ఏపీలో ఎలక్ట్రానిక్స్, సోలార్ రంగాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖ-చెన్నై, బెంగళూరు- చెన్నై కారిడార్లు వస్తున్నాయన్నారు. నీటి వనరులు కల్పించడం వల్ల అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ, ఆటోమొబైల్స్ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. దావోస్ సదస్సు రెండోరోజు కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, శోభనా కామినేని, సీఐఐ ప్రతినిధి చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజల కరంట్ కష్టాలు తొలిగాయి: కేటీఆర్


రాష్ట్రం విడిపోతే కరంటు సమస్యలు వస్తాయన్న ఆనాటి కాం గ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలకు పవర్ కష్టాలు తొలిగిపోయాయి. కానీ కాంగ్రెస్‌కు మాత్రం పవర్ పోయింది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొత్తం కాంగ్రెస్ పార్టీకి పవర్ పోతున్నదని, అందుకే రైతాంగానికి ఇస్తున్న 24 గంటల కరంట్ సరఫరాను సైతం ఆ పార్టీ రాజకీయం చేస్తున్నదని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన పరిపాలనలో ప్రజల కనీస అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. రాష్ట్రం అంతటా తాగు, సాగు నీరు కల్పనకే ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రజల కనీస అవసరాలైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అంశాలపైన దృష్టిసారించినట్లు మంత్రి తెలిపారు. ప్రసంగం అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఓపికగా సమాధానాలు చెప్పారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ స్కూళ్లను చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎన్నారైలు తెలంగాణలో భూములను ధైర్యంగా కొనవచ్చని చెప్తూ.. భూరికార్డులను ప్రక్షాళనచేసి, అన్నీ ఆన్‌లైన్‌లోకి తెస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్ నగరంలో మెరుగుపడిన శాంతిభద్రతలు, వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యలు, క్రీడల అభివృద్ధి మొదలయిన అంశాలపైనా కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్న గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో ఆదర్శప్రాయంగా ముందుకు సాగుతున్నామన్నారు. గత రెండేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రజల నాడి తెలిసిన మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు దగ్గరుండి రూపకల్పన చేసి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. నగరాభివృద్ధికి ఎన్నారైలు చేసే సూచనలు, సలహాలు తీసుకునేందుకు అందుబాటులో ఉంటామన్నారు. జ్యూరిచ్ నగరంలోని శ్రీధర్ గండె, అల్లు కృష్ణారెడ్డి, అనిల్ జాలా, కిశోర్ తాటికొండ తదితరులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. స్వీడన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ దేశాల నుంచి తెలుగువారు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Related Posts