YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రామానుజాచార్యుల నిర్హేతుక కృప...

రామానుజాచార్యుల నిర్హేతుక కృప...

భగవంతుని విషయంలో సమయాన్ని బట్టి మార్పు రాకుండా,భగవంతుని యందే ఏకాగ్రమైన పరిపూర్ణ విశ్వాసం ఉండి, తననే విశ్వసించినవాడిని పరమాత్మ శిరసాధరిస్తాను అని చెప్పాడు పరమాత్మ. అట్లా విశ్వసించేవారి కులాన్ని, సంపదలను ఆదిజాత్యాన్ని పక్కకుపెడతాం. దీన్ని విశ్వసించే పరంపర రామానుజ పరంపర. ఈ ఆచరణే అందరీ ఆచార్యులలో కనిపిస్తుంది. యామునాచార్యులవారి శిష్యులలో ఒకరు మారనేరి నంబి అనే అతను. ఆయన హరిజనుడు. యామునాచార్యులవారు తన ఆప్తుడిగా స్వీకరించారు. యామునాచార్యులవారి శిష్యుడు మరొక ఆయన మహాపూర్ణులు. ఆయన కూడా ఈ మారనేరి నంబితో చాలా స్నేహంగా ప్రవర్తించే వారు. శ్రీరంగ క్షేత్రంలో మహాపూర్ణులవారు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ముందే మారనేరి నంబి మహాపూర్ణులవారి ఇంటిని దర్శించటానికి వచ్చారు ఎందుకంటే గృహ ప్రవేశం తర్వాత ఆయన రావడం సబబు కాదు అని అనుకొని. ఇక గృహప్రవేశం సమయానికి అందరు పండితులు కార్యక్రమాన్ని మొదలుపెడుతుంటే మహాపూర్ణులవారు అన్నారట గృహప్రవేశం అయిపోయింది, మా స్నేహితులు మారనేరి నంబి కాలు పెట్టిన క్షణమే అని చెప్పాడట. భగవంతుని అనుగ్రహం పోందిన వాళ్ళని ఆదరించాల్సిన రీతి ఇదీ. ఈ మారనేరి నంబి దేహయాత్ర చాలించకముందు మహా పూర్ణులతో అన్నారట, మిత్రమా ఈ దేహం గురువుగారి కృప పొందినది. గురువు గారి సేవచేసుకొనే అదృష్టం పొందినది ఈ శరీరం. కానీ ఈ శరీర సంబంధం కల నావాల్లు ఈ సంస్కారం పొందినవాల్లు కాదు. అలాంటి వాల్లు నా శరీరానికి అంత్యక్రియలు చేస్తే దాన్ని అపవిత్రం చేసినట్లు అవుతుందయా. దేవతలు ఆరగింపు చేసేది, దాన్ని అపవిత్రం చేయవద్దు అంటూ వారు దేహాన్ని వదిలారట. మహాపూర్ణులవారు తన గురువుగారి ద్వారా అనుగ్రహం పొందిన మారనేరి నంబి యొక్క దేహాన్ని బ్రహ్మమేద సంస్కారంతో  సంస్కరించారు. ఆనాటి వాళ్ళంతా మహాపూర్ణులవారిని బహిష్కరిస్తాం అన్నా ఏం పట్టించుకోలేదు. రామునుజులవారి గురువుగారు ఈ మహాపూర్ణులు. అయితే లోకంలో వారంతా ఎదో అనుకుంటుంటే వెళ్ళి రామానుజులవారు అడిగారట. అందుకు సమాదానం గా మహాపూర్ణులవారు అన్నారట ఈ మారనేరి నంబి ఒక పక్షి(జటాయువు) కంటే ఏం అల్పుడు కాదు. నేను రాముడికంటే గొప్పవాన్ని అంతకన్నా కాదు అని చెప్పాడట.
రామానుజుల వారికి అదే ప్రేరణ. అందుకే ఆయన హరిజనులూ అంటూ తేడా చూపక గోపురాన్ని ఎక్కి మంత్రాలని, మంత్రార్థాలను యావత్ లోకానికి చాటారు. ఆలయంలో భగవంతుణ్ణి అందరూ దర్శించుకోవచ్చును అనే ఔదార్యాన్ని చూపినవారు. ఆక్రమంలో మనం జీవించాలి.
నాథమునులు, యామునాచార్యుల ద్వారా అందిన మంత్రాలని రామానుజాచార్యులు రుచి ఉన్నవారికి అందేట్టు వ్యవస్తను ఏర్పాటు చేసారు. రామానుజాచార్యుల వారికి ముందు ఉన్న ఆచార్యులు    మంత్రాలని మరొకరికి తెలియజేయడం ఎంతో పరిక్షించిగానీ చేసేవారు కాదు. ఈ విషయం మనం రామానుజాచార్యుల చరిత్ర తెలుసుకుంటే అర్థం అవుతుంది. వారు సుమారు 40 సంవత్సరాలు దాటి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన జ్ఞాని అయి ఉన్నప్పటికీ చరమ శ్లోకలో ఉన్న గంభీరమైన తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి 300 మైల్ల దూరంలో ఉన్న ఆచార్యుడి వద్దకి నడిచి 18 సార్లు వెళ్తే కానీ లభించలేదు. రామానుజాచార్యుల వారిలాంటికే అంత కష్టంగా లభిస్తే సామాన్యులకు మంత్ర ఉపదేశం జరిగే ప్రశ్నే ఉండేది కాదు. ఆడవారికి, బ్రాహ్మణేతరులకి ఉపదేశం అనేదే లేదు ఆకాలంలో. రామానుజాచార్యులవారు ఇంత విలువైన మంత్రాలను లభించకపోతే మనకు జరిగే నష్టం ఏంతో కదా, విలువైనవి మన వద్ద ఉండి కూడా నష్టం ఎందుకు పొందాలి అని జాలి కల్గి, రుచి ఉన్న వారికి, మేము కూడా బాగుపడతాం, నాకూ తెల్సుకోవాలని ఉంది అనే వారందరికీ అందించాలి అని ఆచార్య పరంపర ఏర్పాటు చేసారు.
అంతకు ముందు ఈ మూడు మంత్రాలు ఒకే సారి ఉపదేశం చేసేవారే కాదు. మంత్రం, మంత్ర అర్థం కూడా ఒకేసారి లభించేది కాదు. మరిలా అందరికీ చెబితే దాని విలువ పోదా అంటే, మనిషికి ఒకసారి అంటూ సంస్కారం ఏర్పడితే, లోన నిలిచి పోతుంది, క్రమేపి మనపై ప్రభావం చూపుతుంది. మానవ దేహం అనేది సులభంగా లభించలేదు. ఎన్నో జన్మల క్లేషాల తర్వాత వచ్చింది. ఈ మానవ శరీరం అనేది మెరుపు తీగ పాటి అంత కూడా లేదు అని చెబుతారు అళ్వార్లు. అందుకే సంస్కారం అంటూ ఎర్పడితే మానవ జన్మ కంటే క్రిందకి దిగజార కుండా ఉంటుంది. క్రమేపి బాగుపడే అవకాశం ఉంది. అట్లా అష్టాక్షరీ, ద్వయ మంత్రం మరియూ చరమ శ్లోకాన్ని ఒకేసారి ఉపదేశంగా అందేట్టు చేసారు రామానుజాచార్యులవారు.  అది మన పరంపర. రామానుజాచార్యుల నిర్హేతుక కృప వల్ల మనం ఈనాడు ఆ పరంపరని అనుభవిస్తున్నాం. ఆసంస్కృతిని మనం రక్షించుకోవాలి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts