YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కుంభకర్ణుడు

కుంభకర్ణుడు

రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని.. నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారములోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి. ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళీ  ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి " ఈయనకి తినడం అంటే బాగా ఇష్టం. ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడము తప్పకుండా జరుగుతుంది.  పదార్ధముల వాసనకి నిద్ర లేస్తాడు " అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగములను  చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలో పెట్టి  తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతో మద్యము  తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్ధాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు. తెల్లటి శంఖములను పట్టుకొచ్చి మోగించారు. భేరీలు, మృదంగములు మ్రోగించారు. పెద్ద పెద్ద శూలములు, పరిఘలు, తోమరములు పట్టుకొచ్చి పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరము మీదకి తోలారు. అవి ఆయన శరీరము మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళీ ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చలించకుండా అలానే నిద్రపోతున్నాడు. వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొచ్చి  నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరకడము  మొదలుపెట్టారు.  పర్వతములంత ఎత్తు, బరువు ఉన్న వెయ్యి  ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. ఏనుగులు తన శరీరము మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళీ కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగములు, శంఖములు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలములతో ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిస్తే  కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.
రాక్షసులు " కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదము  ఇవ్వాళ లంకకి ఏర్పడింది. మీ అన్నగారు సీతని అపహరించి తీసుకొచ్చారు. కేవలము నరుడైన రాముడు వానరములని తన సైన్యంగా మలుచుకొని నూరు యోజనముల సముద్రానికి సేతువు కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము " అన్నారు.
కుంభకర్ణుడు " ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకు?  ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు. ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణులని సంహరించడం నాకు  లెక్క కాదు. నాకు చాలా ఆకలిగా ఉన్నది. అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చెయ్యడానికి వెళితే నేను  అక్కడున్న వానరములను,  భల్లూకాలని తినడానికి వెళతాను " అన్నాడు. ఆ రాక్షసులు " అలా వెళ్ళిపోవద్దు. మీ అన్నగారు నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎలా నిర్దేశిస్తే అలా వెళ్ళు " అన్నారు. " ఇవన్నీ తిన్నాక, స్నానం చేసి వస్తాను " అని కుంభకర్ణుడు అన్నాడు. స్నానం చేసి బయటకి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ వెయ్యి  కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరములు భయంతో పారిపోయాయి.  కుంభకర్ణుడిది పెద్ద శరీరం. లంకాపట్టణమునకు దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరములకు కూడా వాడు కనిపించాడు. కొంతమంది చెట్లు ఎక్కేసారు. కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు. కొంతమంది సేతువెక్కి పారిపోయారు. ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు  ఏమిటి విషయము? అని అడుగగా విభీషణుడు " మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు. ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పవద్దు. అలా చెబితే వాళ్ళు భయపడతారు. అది కేవలము ఒక యంత్రమని చెప్పండి " అన్నాడు. కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. రాముడు " విభీషణా ! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేమిటి? వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడా?  " అని అడిగాడు. విభీషణుడు " కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ' ఆకలి  ' అని దేశం మీద పడి మనుష్యులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్ధించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఐరావతము  మీద వెళ్ళి ' నీకు బుద్ధి  లేదా? ఆ తినడము ఏమిటి?  కొన్ని గంటల్లో ఈ ప్రపంచములోని ప్రాణి కోటిని బ్రతకనివ్వవా?  ' అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహముతో పైకి ఎరిగి ' నేను తింటుంటే నువ్వు ఎవడివి  చెప్పడానికి ' అని ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోస్తే ఐరావతం కింద పడిపోయింది. ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు ' సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడా ! అలా తినడమేమిటి? వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి ' అన్నారు.   కుంభకర్ణుడిని బ్రహ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి ' నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో ' అన్నారు. కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషము పొందితే  రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో ' అదేమిటి తాతా అలా శపించావు? వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా?  కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి ' అన్నాడు. బ్రహ్మగారు ' వీడు ఆరు నెలలు నిద్రపోతాడు. ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే ఆరు నెలల తిండి తిని మళ్ళీ  నిద్రపోతాడు ' అన్నారు. అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు. ఇవ్వాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితో యుద్ధం అంటే  సామాన్య మైన విషయము  కాదు " అన్నాడు. కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు. కుంభకర్ణుడు " అన్నయ్యా ! మనం ఏదన్నా ఒక పని చేసేముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావా ! ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు. ఇప్పుడది ఉపద్రవము అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు. నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి. నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే ఆయనని రాజ్యం నుండి బయటకి పంపించేశావు. అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా? నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా? వచ్చే ఉపద్రవము కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా? ఏమి రాజ్య పాలన చేస్తున్నావు  " అని అడిగాడు. ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి " నేను తప్పే చేశాను అనుకో దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప నా తప్పుని పది మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చెయ్యగలిగితే రామలక్ష్మణులని సంహరించు. లేకపోతే వెళ్ళి పడుకో. ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది " అన్నాడు. కుంభకర్ణుడు " ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు?  నేను ఉండి కూడా నీకు ఉపకారం చెయ్యకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి?  యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను " అని బయలుదేరుతున్నాడు. ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి " కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేమిటి?  ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు. మోసాన్ని ప్రయోగము చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులము. ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతే  రామనామాంకితమైన బాణములు మన శరీరము లో గుచ్చుకుని ఉంటాయి. అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనలను కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనములు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. సీత అనుకుంటుంది ' ఇంత సభ జరుగుతున్నది. బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా.... ' అని చాలా కాలముగా  సుఖములకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. రావణుడి కోరిక తీరుతుంది " అన్నాడు. రావణుడు " ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటే భయం. అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు " అని అన్నాడు. కుంభకర్ణుడు " మీరెవరు రానక్కరలేదు. నేనొక్కడినే వెళతాను " అన్నాడు. రావణుడు " నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు " అని చెప్పి కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు. కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది. యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు. అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరి చేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో రెండు వందల  మంది వానరములను  పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరములలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకి దుకేస్తున్నారు. కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకి దూకేస్తున్నారు. బయటకి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళీ  ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకములము  పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరములు చనిపోయాయి. వానరములకి వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు. కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు. కొంతమంది సముద్రములో దూకారు. కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు. అంగదుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అన్నాడు " మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా! రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు? యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతారా ! మీ పౌరుషము ఏమయింది  " అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు. నీలుడు, ఋషభుడు, గంధమాధనుడు, సుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళారు. కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. వాళ్ళని అవతలికి విసిరేశాడు. కాని వాళ్ళు చాలా దేహ ధారుడ్యము, బలము ఉన్నవాళ్లు కనుక కిందపడి మూర్చపోయారు. ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదములతో తన్నాడు. కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతో సుగ్రీవుడిని కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు. మళ్ళీ స్పృహ వచ్చి పైకి లేవబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు " సుగ్రీవా ! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉన్నదా ! నువ్వు ఋక్షరజస్సు కొడుకువి (బ్రహ్మగారి కొడుకైన ఋక్షరజస్సు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులో  స్నానం చేశాడు. స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యొక్క తలోచెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము స్కలనమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగమునందు విడిచిపెట్టాడు. సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కంఠ భాగమునందు విడిచిపెట్టాడు. ఆ కంఠ భాగమునుండి సుగ్రీవుడు, వాల భాగమునుండి వాలి పుట్టారు. ఆ తరువాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తటాకములో స్నానం చేయించాడు. అప్పుడాయన మళ్ళీ తన వానర రూపమును  పొందాడు). నేను నిన్ను విడిచిపెట్టను ..." అని శూలం పట్టుకొని సుగ్రీవుడిని గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు నెత్తురు కక్కుతూ కిందపడిపోయాడు. హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశాడు.  కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన చంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయములో హనుమంతుడు చూసి అనుకున్నాడు ' నాకు ప్రభువు అయినవాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడనైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే, అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివొస్తుంది. వేచి చూద్దాము " అని హనుమంతుడు అనుకున్నాడు. లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషము కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీదనుంచి, మేడల మీదనుంచి చందన ద్రవములను కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్ళతో చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.   కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడముతో వానరులతో, భల్లూకములతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగము  చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో " ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి?  నిన్ను చంపితే లాభం ఏమిటి?  నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు.నేను రాముడి దగ్గరి వెళతాను " అన్నాడు. లక్ష్మణుడు కొట్టిన బాణములకు, సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరము  నుండి నెత్తురు కారుతోంది.  లక్ష్మణుడు " వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. ఆ  బరువుకి వాడు కిందపడిపోతాడు " అన్నాడు.
కొన్ని కోట్ల వానరములు ఎగిరి వాడిమీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అన్ని వానరములు కిందపడిపోయాయి. అందరూ రాముడి దగ్గరికి వెళ్ళారు. " రామా ! ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. మీరొచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించండి " అన్నారు. రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది. ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి కళ్ళు తిరిగినంత పనయ్యింది. రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరములు పడి చనిపోయాయి.  కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వస్తే రాముడు ఐంద్రాస్త్రముతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు. రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన కాళ్ళతో వానరాలని తొక్కడము  ప్రారంభించాడు. రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరములో సగభాగం సముద్రంలో పడిపోయింది. మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది. కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ " అయ్యో! నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణముగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను.  కుంభకర్ణుడు మరణించాడు. నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది " అని కిందపడి ఏడుస్తుంటే రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు. " నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము " అన్నారు. రావణుడు " ఇప్పటికయినా నా కోరిక తీర్చండి " అన్నాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Related Posts