YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అడుగులు

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అడుగులు

విశా్ఖపట్టణం, మే 6, 
కేంద్రంలోని మోడీ సర్కార్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసి భారం వదిలించుకోవాలన్నదే ఆ నిర్ణయం. దీని మీద ఎంత మంది ఎన్ని రకాలుగా ఆందోళనలు చేస్తున్నా కూడా కేంద్రం కరగడంలేదు. పైగా పదే పదే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అని. తమ సంస్థను తాము ఏం చేసుకున్నా తప్పేం లేదని కూడా వాదిస్తున్నారు. ఆంధ్రుల కోడలుగా మీరు ఇలాంటి పని చేయడం మంచిది కాదు అని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినా కూడా అదే సభలో ఉన్న నిర్మలాసీతారామన్ నుంచి కనీస స్పందన కాన‌రాలేదు.దేశంలో సెకండ్ వేవ్ కరోనా పెద్ద ఎత్తున వ్యాపించింది. ఈసారి కరోనా లక్షణాలలో భారీ తేడా ఉంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. దాంతో ఆక్సిజన్ కి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. చాలా చోట్ల ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మరణిస్తున్నారు. అటువంటి వేళ అతి పెద్ద ఆక్సిజన్ ప్రోడక్షన్ సెంటర్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలవడం విశేషం. గత ఏడాది కూడా విశాఖ ఉక్కు కర్మాగారం పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ ని తయారు చేసి దేశానికి అందించింది. ఎనిమిది వేల టన్నులకు పైగా విశాఖలో ఆక్సిజన్ నాడు జాతికి లభించింది. అయితే నాటి కంటే ఇపుడు డిమాండ్ ఎక్కువగా ఉంది.విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దాంతో గరిష్టంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ దాన్ని ప్రభుత్వానికి చాలా వీలుగా అందచేస్తోంది. అదే ప్రైవేట్ పరం అయితే ఈ వీలు కానీ వెసులుబాటు కానీ ఉంటుందా అన్న చర్చ అయితే ఉంది. దేశానికి ఊపిరి పోస్తూ ఒక విధంగా పునర్జన్మని విశాఖ స్టీల్ ప్లాంట్ అందిస్తోంది అంటున్నారు. ఈ విషయంలో తమకు చాలా గర్వంగా ఉందని కార్మికులు, యూనియన్ నాయకులు కూడా అంటున్నారు. ఇంతలా సేవ చేస్తూ ఉక్కు ఉత్పత్తుల్లో కూడా లాభాల బాటలో ఉన్న తమ పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం తగునా అన్నదే వారి నుంచి వస్తున్న ప్రశ్న.దేశానికి అక్సిజన్ అందిస్తూంటే విశాఖ ఉక్కు కర్మాగారం గొంతు నులమడానికి చూడడం న్యాయమా అని కార్మిక‌ లోకం గట్టిగానే నిలదీస్తోంది. ఊపిరి పోస్తున్న తమ ఉసురు తీయడానికి చూడడం న్యాయమా అని కూడా నిలదీస్తున్నారు. ఈ మధ్యనే విశాఖలో అతి పెద్ద కార్మిక సభ కూడా జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలాగైనా తాము కాపాడుకుంటామని కూడా అఖిల భారత కార్మిక నాయకులు శపధం చేశారు. లాభాలతో పాటు దేశానికి ఆక్సిజన్ గనిగా ఉన్న విశాఖ ప్లాంట్ అవసరం ఏంటో ఇపుడు దేశానికి కరోనా వేళ బాగా తెలిసివచ్చిందని కూడా వారు అంటున్నారు. మొత్తానికి అందరికీ విశాఖ ఉక్కు విలువ, గొప్పతనం తెలుసు. కరోనా సెకండ్ వేవ్ వేళ విశాఖ స్టీల్ అందిస్తున్న సేవలు చూసి అయినా మోడీ సర్కార్ మనసు మార్చుకుంటుందా అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

Related Posts