YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

కరోనా సంక్షోభం వేళ.. ప్రభుత్వ ఖజానాకు ఆర్ బీఐ రూ.99,122 కోట్లు బదిలీ

కరోనా సంక్షోభం వేళ.. ప్రభుత్వ ఖజానాకు ఆర్ బీఐ రూ.99,122 కోట్లు బదిలీ

న్యూ ఢిల్లీ మే 22
కరోనా సెకండ్ వేవ్  సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్బ్యాంక్ (ఆర్ బీఐ) నుంచి భారీగా నిధులు సమకూర్చనున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో తన వద్ద ఉన్న రూ.99122 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీఐ) నిర్ణయించింది. ఈ  మేరకు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. కరోనా వైరస్  కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. 1940 సంవత్సరం నుంచి ఆర్ బీఐ అనుసరిస్తున్న జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని ప్రభుత్వం అధికారికంగా అనుసరించే ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరంతో అనుసంధానం చేయాలన్న నిర్ణయం వల్ల ఈ ఏడాది మార్చి నాటికే ఆర్థిక సంవత్సరం ముగిసింది.ఈ కారణంగా ఆర్బీఐ తొమ్మిది నెలల కాలానికి అందుబాటులో ఉన్న నిధులను మాత్రమే ఈ ఏడాది బదిలీ చేస్తోంది. కరెన్సీ ట్రేడింగ్ బాండ్ల ట్రేడింగ్ నుంచి ఆర్బీఐ భారీగా ఆదాయం పొందుతుంది. దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. అలా ఇప్పుడు కూడా రూ. 99122 కోట్లను పంపించేందుకు నిర్ణయించినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది కరోనా తొలి దశ సమయంలోనూ రిజర్వ్ బ్యాంకు డివిడెంట్ పంపించింది. అప్పుడు మొత్తం మిగులు ద్రవ్యంలో 44శాతం అంటే రూ. 57వేల కోట్లకు కేంద్రానికి ఇచ్చింది. గత ఏడు సంవత్సరాల్లో ఆర్ బీఐ ఇచ్చిన అత్యంత తక్కువ డివిడెంట్ అదే. ఆర్ బీఐ ఎప్పుడైనా 6.5 శాతం నుంచి 5.5 శాతం మధ్యలో నిధులు కంటింజెన్సీ రిస్క్ బఫర్ గా నిర్వహించాలని ఆ కమిటీ నిర్దేశించింది. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిపై సమీక్షించడంతో పాటు దేశీయ అంతర్జాతీయ సవాళ్లను కరోనా రెండో విడత ఉదృతి ప్రభావాన్ని తగ్గించేందుకు ఇటీవల తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు.ఆర్ బీఐ మిగులు నిధులు బదిలీ చేయడం ప్రభుత్వానికి ఎంతో బలం చేకూరుస్తుందని ప్రస్తుత పాక్షిక లాక్ డౌన్ ల వల్ల కోల్పోతున్న ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకుని అవసరంలో ఉన్న వారికి మరింతగా ఆర్థిక చేయూత అందించగలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కమోడిటీ ధరలు గగనవిహారం చేస్తున్న తరుణంలో కార్పొరేట్లపై ఒత్తిడి పెరిగి ప్రత్యక్ష పన్ను వసూళ్లపై ప్రభావం పడుతుందని ఆ నష్టాన్ని ఈ నిధులు భర్తీ చేస్తాయని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అన్నారు.

Related Posts