
లండన్ జూన్ 18
యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్తో చిన్నారుల్లో కొవిడ్కు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి వాడే కార్టికో స్టెరాయిడ్లు కొవిడ్ బాధిత చిన్నారుల్లో చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తేల్చారు. కొవిడ్ బారినపడిన 50 వేల మంది చిన్నారుల్లో ఒకరికి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (ఎంఐఎస్-సి) అనే రుగ్మత వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.వైరస్ సోకిన 2-6 వారాల్లో ఈ రుగ్మత తలెత్తవచ్చునని, ఫలితంగా బాధితుల్లో తీవ్ర జ్వరం, ఉదర భాగంలో నొప్పి, వాంతులు, కళ్లు ఎర్రబారడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటివి వస్తాయని, రక్త నాళాలు వ్యాకోచం చెందుతాయని తెలిపారు. ఈ రుగ్మతతో మరణం సంభవించే అవకాశం కూడా ఉన్నదని పేర్కొన్నారు. దీనికి యాంటీబాడీ చికిత్సకు బదులుగా చౌకలో, విస్తృతంగా అందుబాటులో ఉన్న చికిత్సా సాధనంగా స్టెరాయిడ్లు ఉపయోగపడతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన ఎలిజబెత్ విటేకర్ తెలిపారు.పరిశోధనలో భాగంగా తాము మిథైల్ ప్రెడ్నిసోలెన్ వంటి కార్టికో స్టెరాయిడ్లను, యాంటీబాడీ చికిత్సను పోల్చి చూశామని పరిశోధకులు తెలిపారు. యాంటీబాడీలు మాత్రమే పొందినవారు, యాంటీబాడీలతో కలిపి కార్టికో స్టెరాయిడ్లు పొందినవారు, కేవలం కార్టికో స్టెరాయిడ్లు పొందినవారు.. ఇలా మూడు రకాల చికిత్స మార్గాలను శాస్త్రవేత్తలు పరిశీలించి, ఈ మూడు రకాలూ సమర్థంగానే పనిచేశాయని తేల్చారు.అయితే యాంటీబాడీలు మాత్రమే పొందినవారితో పోలిస్తే స్టెరాయిడ్లు మాత్రమే పొందినవారిలో అవయవాల వైఫల్య రేటు, మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీనికితోడు యాంటీబాడీల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో కార్టికో స్టెరాయిడ్లు మెరుగైన చికిత్స మార్గమవుతాయని తెలిపారు.