
న్యూఢిల్లీ జూలై 10
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ నియంత్రణతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారంలో ఢిల్లీలో కరోనా పాజిటివ్ రేట్, కేసుల నమోదు ఆధారంగా ఎల్లో, అంబర్, ఆరెంజ్, రెడ్ హెచ్చరికలు జారీ చేస్తారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ రేటు వరుసగా రెండు రోజులపాటు 0.5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, వారం రోజుల్లో కొత్త కేసుల సంఖ్య 1,500 దాటినా లేదా వారంలో రోజుల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల భర్తీ 500కు చేరినా ఎల్లో హెచ్చరిక జారీ చేస్తారు. ఈ హెచ్చరికతో ఢిల్లీలో నిత్యవసరం కాని షాపులు, షాపింగ్ మాల్స్ను సరి, బేసి విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతిస్తారు. ప్రతి మున్సిపల్ జోన్లో ఒక వారాంతపు మార్కెట్ను మాత్రమే తెరుస్తారు. నిర్మాణ కార్యకలాపాలు, తయారీ సంస్థలు, పారిశ్రమలను కొనసాగిస్తారు. కరోనా పాజిటివ్ రేట్ వరుసగా రెండు రోజులు ఒక శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, వారంలో కొత్త కేసుల నమోదు 3,500కు దాటినా, వారం రోజుల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల భర్తీ 700కు చేరినా అంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. ఈ హెచ్చరికతో ఢిల్లీలోని షాపులు, షాపింగ్ మాల్స్ను సరి, బేసి విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారు. ప్రతి మున్సిపల్ జోన్లో ఒక వారాంతపు మార్కెట్ను 50 శాతం సామర్థ్యంతో తెరుస్తారు. నిర్మాణ, పరిశ్రమల కార్యకలాపాలు, తయారీ సంస్థలను కొనసాగిస్తారు.కరోనా పాజిటివ్ రేట్ వరుసగా రెండు రోజులు రెండు శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, వారంలో కరోనా కొత్త కేసుల నమోదు 9,000కు చేరినా, వారం రోజుల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల భర్తీ 1,000 దాటినా ఆరంజ్ హెచ్చరిక జారీ చేస్తారు. ఈ హెచ్చరికతో కేవలం నిత్యవసర షాపులు మాత్రమే సరి, బేసి విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారు. షాపింగ్ మాల్స్, వారాంతపు మార్కెట్లను మూసివేస్తారు.కరోనా పాజిటివ్ రేట్ వరుసగా రెండు రోజులు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, వారంలో కరోనా కొత్త కేసుల నమోదు 16,000కు చేరినా, వారం రోజుల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల భర్తీ 3,000 దాటినా రెడ్ కలర్ కోడ్ హెచ్చరిక జారీ చేస్తారు. ఈ హెచ్చరికతో కేవలం నిత్యవసర షాపులు, నిత్యవసర సేవలు తప్ప అన్నింటిని మూసివేస్తారు.మరోవైపు ఈ విధమైన కలర్ కోడ్ హెచ్చరిక విధానం ద్వారా ఢిల్లీలో ఎప్పుడు లాక్డౌన్ విధిస్తారు, ఎప్పుడు ఎత్తి వేస్తారు అన్నది ప్రజలకు చాలా సులువుగా అర్థమవుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నియంత్రణతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.