YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మహర్షుల దివ్య చరిత్రలు. కపిల మహర్షి!

మహర్షుల దివ్య చరిత్రలు.  కపిల మహర్షి!

కపిల మహర్షి ఎవరో తెలుసా ? సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే !! ఇప్పుడు మనం ఆయన కథలోకి వద్దాం . పూర్వం అంటే కృతయుగంలో కర్దమ ప్రజాపతి అనే ఆయన సరస్వతీనదీ తీరంలో పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు . విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు దేవహూతి అనే భార్యయందు తొమ్మిది మంది కూతుళ్ళు , నా అంశతో ఒక కొడుకు పుడతారని చెప్పాడు . కొంతకాలానికి కర్దమ ప్రజాపతికి తొమ్మిది మంది కూతుళ్లు పుట్టారు . కర్దమ ప్రజాపతి భార్య దేవహూతిని పిలిచి నేను తపస్సు చేసుకుందుకు వెడుతున్నానని చెప్పాడు . అప్పుడు దేవహూతి స్వామీ ! ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వంశం ఉద్ధరించడానికి ఒక కొడుకుని ప్రసాదించి తరువాత తపస్సు చేసుకుందుకు వెళ్ళండి అంది . విష్ణుమూర్తె నీకు కొడుకుగా పుడతాడు . కాబట్టి , నువ్వు విష్ణుమూర్తిని ప్రార్థించు అని భార్యకి చెప్పాడు . దేవహూతి కూడ భర్త చెప్పినట్లే భగవంతుణ్ణి ప్రార్థించింది . కొన్నాళ్ళకి ఆమెకి ఒక కొడుకు పుట్టాడు . దేవతలు పుష్పవర్షం కురిపించారు . గంధర్వులు , కిన్నెరలు గానం చేశారు . అప్సరసలు నాట్యం చేశారు . బ్రహ్మదేవుడు , గొప్పగొప్ప మునులు అందరూ వచ్చి ఆ పిల్లాడిని చూసి కర్దమ ప్రజాపతికి దేవహూతికి ఆ పిల్లవాడు విష్ణుమూర్తి అవతారమేననీ , అతడు కపిల మహర్షిగా ప్రసిద్ధి కెక్కుతాడనీ చెప్పి మరీచి అనే ఒక మునిని అక్కడ ఉంచి తిరిగి వెళ్ళిపోయారు . కొంతకాలమయ్యాక ప్రజాపతి తన కూతుళ్లకి మహర్షులతో పెళ్ళిళ్ళు జరిపించాడు . ఒకనాడు కపిల మహర్షిని పిలిచి మహాత్మా ! భగవంతుడవైనా నువ్వు నా యింట్లో నాకు కొడుకుగా పుట్టావు . నాకు ఇంతకన్న భాగ్యం మేముంటుంది ? ఇంక నేను తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు .

కపిల మహర్షి - " నేను ఈ మునివేషంలో పుట్టింది నాకోసం కాదు మునులందరికీ భగవంతుడి గురించి తెలియచెప్పడానికే ” అన్నాడు . నువ్వు కూడ నా మీదే దృష్టి పెట్టి తపస్సు చేసుకో , మోక్షం వస్తుంది వెళ్ళిరా ... అని తండ్రి కర్దమ ప్రజాపతిని పంపించాడు . దేవహూతి కొడుకుని రక్షించమని వేడుకుంటుంది . కపిల మహర్షి నీ మనస్సు సంసారం మీద పెట్టకుండా భగవంతుడి మీద పెట్టమని సాంఖ్య యోగం , భక్తి యోగం ఉపదేశం చేశాడు . దేవహూతి మోక్షం పొందిన చోటుని ' సిద్దిప్రద ' అంటారు .

కపిల మహర్షి ఒకసారి గోవుని అది వేదస్వరూపం అని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా దాన్ని చూశాడు . సూర్యరశ్మి అనే ఒక ముని కపిల మహర్షికి వేదాలంటే అసలు ఏ భావం ఉందో తెలుసుకుందామని ఆవులో ప్రవేశించాడు . కపిలుడి ముందుకు వచ్చి వేదాలంటే చాలా గొప్పవంటారు కదా ! నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు . 

కపిలుడు నాకు వేదాల మీద సదభిప్రాయం లేదు అన్నాడు . భగవంతుణ్ణి మనస్సులో ప్రతిష్టించి , వాక్కుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి , బ్రాహ్మణులు మాత్రం వేదోక్తంగా వాళ్ళ కర్మలని వాళ్ళు చెయ్యాలి . వేదపాఠకులు , వేదజ్ఞులు అవ్వాలి . అంటే వూరికే వేదాలు చదవడం కాదు , ఆచరించాలని చెప్పాడు . సూర్యరశ్మి కపిల మహర్షికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు .

పుండరీక మహారాజు వేటాడుతూ దాహం వేసి కపిల మహర్షి ఆశ్రమంలో వున్న ఒక సరస్సులో మంచి నీళ్ళు త్రాగి , అక్కడ పరుగులు పెడుతున్న లేడిని చూసి దాన్ని చంపాడు . అది పరిగెత్తుతూ వెళ్ళి కపిల మహర్షి ముందు ప్రాణాలు వదిలింది . అది చూసి కపిలమహర్షి ఆ పుండరీకుణ్ణి మందలించాడు . నీ విలాసం కోసం నోరులేని జంతువును చంపావు . నీ శరీరం మీద నీకెంత ప్రేమ ఉందో దానికి కూడా దాని శరీరం మీద అంత ప్రేమ ఉండదా ? అని మందలించాడు . పుండరీకుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో ఆత్మహత్య చేసుకోబోయాడు . కపిల మహర్షి పుండరీకుణ్ణి ఆపి ఆత్మహత్మ మహాపాపమనీ , సంపదలు క్షణికమేననీ , పరులను హింసించడం పాపమనీ , గురువాజ్ఞతో గురువు చెప్పిన ప్రకారం నడుచుకోవాలనీ , అప్పుడే మోక్షం కలుగుతుందని చెప్పాడు . పుండరీకుడు తన రాజ్యం , సంపదలూ వదిలేసి కపిల మహర్షిని , తనని శిష్యుడిగా చేసుకోమున్నా కపిల మహర్షి మాట్లాడలేదు . పుండరీకుడు నీళ్లల్లో కూర్చుని ఆ పదమూడు రోజులు కపిల మహర్షిని గురించే తపస్సు చేశాడు . పధ్నాలుగో రోజు కపిలుడు పుండరీకుడికి కర్మ , భక్తి , వైరాగ్యం , జ్ఞానం మొదలయిన నాలుగు యోగాల గురించి బోధించాడు . పుండరీకుడు కపిల మహర్షి చెప్పిన విధంగా చేసి మోక్షాన్ని పొందాడు .

ఒకసారి సగర చక్రవర్తి ఎన్నో అశ్వమేధయాగాలు చేసి ఇంకా ఆశ తీరక మళ్ళీ ఇంకొక యాగం మొదలు పెట్టాడు . ఇంద్రుడికి అసూయ కలిగి ఆ గుర్రాన్ని నాగలోకం తీసుకువెళ్ళి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడు . సగరుడి కొడుకులు అరవై వేలమంది ఆ గుఱ్ఱం కోసం వెతుకుతూ వచ్చి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర తమ గుట్టాన్ని చూశారు . వాళ్ళు కపిల మహర్షి తమ గుర్రన్ని అక్కడ కట్టేసుకున్నాడని అనుకున్నారు . కపిల మహర్షిని చంపుదామనుకున్నారు . కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశాడు . అంతే అరవై వేలమంది భస్మం అయిపోయారు . అప్పుడు సగరుడి మనవడు అంశుమంతుడు గుర్రాన్ని వెతుకుతూ వచ్చి కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని ఇమ్మని ప్రార్థించాడు .

కపిలుడు తీసుకుపోయి మీ తాత యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు . అంశుమంతుడు గుర్రాన్ని తాతకి ఇచ్చి యాగం పూర్తి చేయించాడు . కొంతకాలం తర్వాత భగీరధుడు గంగాజలాన్ని భూమిమీదకు తెచ్చినప్పుడు ఆ నీళ్ళు తగిలి సగరుడి కొడుకులు అరవైవేల మంది మళ్ళీ బ్రతికారు . 

పూర్వం అశ్వశిరుడు అనే మహారాజు యాగాలు చేస్తూ బ్రాహ్మణులకి దానధర్మాలు చేస్తూ ఉండేవాడు . ఒక రోజు కపిల మహర్షి జైగీషవ్య మునిని తీసుకుని అశ్వశిరుడి  దగ్గరకి వెళ్ళాడు . అశ్వశిరుడు కపిల మహర్షికి నమస్కారం చేసి స్వామీ ! నేను విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి ? అని అడిగాడు .

కపిల మహర్షి రాజా ! నేనే విష్ణుమూర్తిని అన్నాడు . దానికి రాజు విష్ణుమూర్తి అంటే ఇలా ఉండడు గదా ? శంఖం , చక్రం , గరుడవాహనం ఉంటాయి కదా . నువ్వే విష్ణుమూర్తివని నాకు నమ్మకం లేదు అన్నాడు . కపిల మహర్షి విష్ణుమూర్తి రూపంతో , జైగీషవ్య ముని గరుడవాహనంగా కనిపించారు . మళ్ళీ రాజు అనుమానంతో విష్ణుమూర్తి బ్రహ్మమనస్సులోంచి పుట్టినవాడు కదా ! బ్రహ్మ నాభిలోంచి పద్మంతో పాటు పుడతాడు కదా ! మరి నువ్వు అలాలేవేం ? అన్నాడు . కపిల మహర్షి రాజుకి కావలసినట్లే కనిపించాడు . రాజు ఇంకా నమ్మకుండ ఇదంతా మోసం అనుకుంటాడు . అప్పుడు సభలో ఆశీనులైన వారంతా మాయమయిపోయి క్రూరజంతువుల్లో ఆ సభ నిండిపోయింది . అప్పుడు రాజు భయపడి కపిల మహర్షిని ప్రార్ధించాడు . కపిల మహర్షి రాజుకి కనపడి రాజా ! నువ్వు విష్ణుభక్తుడవే కాని , విష్ణువు లోకం అంతా నిండిపోయి ఉన్నాడు అని అర్ధం చేసుకోలేక పోతున్నావు . ఇంక అది తెలుసుకుని నీ కులానికి తగిన ధర్మాలు , వేదవిహితాచారాలు చేస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు . కపిల మహర్షి సాంఖ్యయోగాన్ని గురించి బోధించాడు . దీన్ని ' కపిలస్కృతి ' అని కూడ అంటారు . దీంట్లో ఆయుషు క్షణికమని , సుఖదఃఖాలు కాలాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయని ఆత్మ అంటే నారాయణుడే అని , అత్మని తెలుసుకుని మోక్షం పొందాలని చెప్పాడు . వేద , శాస్త్ర పురాణాల్లో ఉన్నంత జ్ఞానం దీంట్లో ఉంది . మనం కొంచెం చిన్నవాళ్ళం కదా ! ముందు ముందు తెలుసుకుందాం . కపిల మహర్షి భక్తియోగాన్ని గురించి కూడ చెప్పాడు . ఎప్పుడూ హింసతో కూడిఉన్న పనే చేస్తూ , ఈర్ష్య , అసూయ లాంటి చెడ్డ గుణాలు ఉండి భగవంతుడంటే భక్తి ఉన్నవాణ్ణి తామస భక్తుడు అంటారు . అన్ని రకాలయిన సుఖాలు అనుభవిస్తూ భక్తి కలిగి ఉండేవాణ్ణి రాజస భక్తుడు అంటారు . ఇతరుల కోసం భక్తుడయ్యేవాణి సాత్త్విక భక్తుడు అంటారు . అసలైన భక్తుడు భగవంతుడి గురించి వింటే చాలు భక్తితో పరవశించిపోతాడు . అతడే అసలయిన భక్తుడు , పరమ భక్తుడు అని చెప్పాడు . కపిల మహర్షి ఒకసారి పశ్చిమ సముద్రతీరంలో పద్మాసనం వేసుకుని , కళ్ళుమూసుకొని ధ్యానంలో ఉన్నాడు . రావణాసురుడు ఈశ్వరుడి వల్ల వరం పొంది బలవంతుల్ని అందర్నీ చంపేద్దామని తిరుగతూ కపిల మహర్షిని చూశాడు . రావణుడి కంటికి కపిల మహర్షి చేతుల్లో ఆయుధాలతో వక్షస్థలం మీద లక్ష్మీదేవి , కళ్ళలో సూర్యచంద్రులు , ధాత , విధాత , రుద్రులు అందరూ కలిసి కనిపిస్తున్నారు . రావణుడు ఇందంతా ఋషులమాయేలే అనుకుని కపిల మహర్షిని కొట్టాడు . వేంటనే కపిల మహర్షి కూడ రావణుడ్ని ఒక దెబ్బ వెయ్యగానే రావణుడు మూర్ఛపోయాడు . కపిలుడు గుహలోకి వెళ్ళిపోయాడు . 

రావణుడు తెలివొచ్చి మళ్ళీ గుహలోకి వెళ్ళాడు . కపిల మహర్షిని చూసి మహాత్మా ! మీరెవరు ? అని అడిగాడు . కపిల మహర్షి నోరు తెరవగానే రావణుడు విష్ణుమూర్తి విశ్వరూపం చూసి మహాత్మా ! మీ చేతిలో చచ్చిపోవడంకంటే నాకింకేం కావాలి ? అనుగ్రహించండి అని కళ్ళు మూసుకున్నాడు . కపిల మహర్షి ఆ గుహలో మాయమైపోయాడు . 

కపిల మహర్షి చరిత్రలో ఇలాంటి కథలు అనేకం వున్నాయి ! 

కపిల మహర్షి చెప్పిన సాంఖ్య యోగం , భక్తియోగం , ఇప్పటికి మనకి అందుబాటులో ఉన్నాయి . అవి చదివి ఆచరించి ముక్తిని పొందవచ్చు . మనం కూడ విష్ణుమూర్తి విశ్వరూపాన్ని చూడవచ్చు . చూశారా ! మనలాంటి అజ్ఞానుల్ని ఉద్ధరించడానికి మనిషి రూపంలో పుట్టి , తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది మునులకి జ్ఞానబోధ చేసి , ఎంతోమంది మహాత్ముల్ని మనకోసం ఈ భూలోకంలోకి పంపి , మనకి ధర్మంగా ఎలా బ్రతకాలో కపిల మహర్షి రూపంలో  సాక్షాత్తు విష్ణుమూర్తె బోధించాడు .

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts