
లోకసభకు మంత్రుల పరిచయం
న్యూఢిల్లీ, జూలై 19,
లోక్సభలో ఇవాళ ప్రధాని మోదీ తన మంత్రిమండలిని పరిచయం చేశారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే.. ప్రధాని మోదీ మాట్లాడారు. దేశానికి చెందిన దళితులు, మహిళలు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్రతిపక్షాలకు సంతోషంగా లేదని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఉత్సాహ వాతావరణం ఉంటుందని అనుకున్నానని, కొత్త మహిళా, దళిత ఎంపీలను స్వాగతిస్తున్నామని, ఎంపీలను పరిచయం చేయాలనుకున్నానని, కానీ కొందరికి మాత్రం దళిత ఎంపీలు మంత్రులు కావడం నచ్చడం లేదని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్యవసాయ, గ్రామీణ నేపథ్యం ఉన్నవారు మంత్రులు అయినట్లు ప్రధాని చెప్పారు. మంత్రిమండలిలో ఓబీసీ వర్గం కూడా ఉందన్నారు. ప్రధాని మోదీ తన మంత్రిమండలి ప్రవేశపెడుతున్న సమయంలో విపక్షాలు అడ్డుకోవడాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు.
లోకసభలో ఆందోళన
లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్సీపీ ఎంపీలు పట్టుబట్టారు. వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానానికి ఎంపీ మిథున్ రెడ్డి నోటీసు ఇచ్చారు..ఇక పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం.. వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.
కొత్తగా సభ్యుల ప్రమాణం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.ఇక ఇటీవల ఉపఎన్నికల్లో గెలిచిన కొత్త ఎంపీలు నేడు లోక్సభలో ప్రమాణం చేయనున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్సభస్థానం నుంచి గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి లోక్సభలో ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఇటీవల ఎంపీకైన కొత్త మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించనున్నాయి.లోక్సభలో 2 బిల్లులు.. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ చట్టం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్షిప్, మేనేజ్మెంట్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11గంటకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయి. నేటి నుంచి ఆగస్టు 13వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19సార్లు సభ సమావేశం అవుతుంది.