.jpg)
సైకిళ్లపై టీఎంసీ ఎంపీలు
న్యూఢిల్లీ, జూలై 19,
పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్కు సైకిల్పై వచ్చారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అనేక నగరాల్లో ప్రస్తుతం లీటర పెట్రోల్ ధర వంద రూపాయాలు దాటింది. 61 సౌత్ అవెన్యూ నుంచి తృణమూల్ ఎంపీలు సైకిల్పై పార్లమెంట్కు వచ్చారు. నూతన రైతుల చట్టాలపై చర్చ చేపట్టాలని ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ గిల్, మనీష్ తివారీలు ఈ తీర్మానం ఇచ్చినవారిలో ఉన్నారు. సీపీఎం ఎంపీలు కూడా రైతుల నిరసనపై చర్చ చేపట్టాలని నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీ కరీమ్, వీ శివదాసన్.. 267 రూల్ కింద నోటీసు ఇచ్చారు.
వైసీపీ సభ్యుల ఆందోళన
ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది.కాగా, ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈ రోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు