
న్యూఢిల్లీ జూలై 20
ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా చనిపోయింది 4.14 లక్షల మంది అని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఈ మరణాలు అంతకు పది రెట్లు ఎక్కువే ఉంటాయని తాజాగా చేసిన ఓ సమగ్ర సర్వే స్పష్టం చేసింది. మొదటి నుంచీ చాలా మంది అనుమానిస్తున్నదే నిజమని తాజాగా సర్వే తేల్చింది. అంతేకాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతటి పెను విషాదాన్ని ఇండియా గతంలో ఎప్పుడూ చూడలేదనీ ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే రిపోర్ట్ మంగళవారం విడుదలైంది. ఈ సర్వేను దేశ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్తోపాటు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు రీసెర్చర్లు చేశారు. దీని ప్రకారం దేశంలో 2020 జనవరి నుంచి 2021 జూన్ మధ్య కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30 లక్షల నుంచి 47 లక్షల మధ్య ఉండొచ్చు. అధికారిక లెక్కల కంటే అసలు మరణాల రేటు ఎంత ఎక్కువగా ఉందో దీనిని బట్టి తెలుస్తోందని ఆ సర్వే చెబుతోంది.పేషెంట్లతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోవడం లేదా సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్ల చనిపోయిన వారిని లెక్కలోకి తీసుకోకపోవడం వల్ల ఈ భారీ తేడా వచ్చి ఉండొచ్చని ఈ సర్వే అంచనా వేసింది. కొవిడ్ మరణాలు లక్షల్లో కాదు.. మిలియన్లలో ఉన్నాయి. మూడు పద్ధతుల్లో దేశంలో కరోనా మరణాల లెక్కగట్టింది ఈ సర్వే. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో జననమరణాలను నమోదు చేసే రిజిస్ట్రేషన్ వ్యవస్థ నుంచి సేకరించిన డేటా, ఇండియాలో వైరస్ ఎంత ప్రబలంగా ఉందో చెప్పే రక్త నమూనాలతోపాటు అంతర్జాతీయంగా కొవిడ్ మరణాల రేటు, ఏడాదికి మూడుసార్లు 9 లక్షల మందిపై చేసే ఆర్థిక సర్వే ఆధారంగా మరణాలను లెక్కగట్టారు.అన్ని రకాల మరణాలను పరిగణనలోకి తీసుకొని, దానిని గతేడాది మరణాలతో పోల్చి ఈ లెక్క తేల్చినట్లు రీసెర్చర్లు చెప్పారు. అయితే తాము సర్వే చేసిన ఈ ఏడు రాష్ట్రాల్లోని పరిస్థితే మిగతా రాష్ట్రాల్లోనూ ఉంటుందని చెప్పలేమని వాళ్లు తెలిపారు. దేశంలో అర్బన్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ఇతర దేశాలు కూడా కొవిడ్ మరణాల లెక్క తప్పినా.. ఇండియాలో మాత్రం ఆ తేడా చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. దేశ విభజన తర్వాత ఇదే అతిపెద్ద విషాదం అని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. 1947లో దేశ విభజన సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల్లో పది లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు.