YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కశ్మీర్ లో కాంగ్రెస్ కుదురుకుంటోందా

 కశ్మీర్ లో కాంగ్రెస్ కుదురుకుంటోందా

 కశ్మీర్ లో కాంగ్రెస్ కుదురుకుంటోందా
శ్రీనగర్, ఆగస్టు 23, 
నిన్న మొన్నటి దాకా నిద్రాణంగా ఉన్న కీలక సరిహద్దు రాష్ర్టమైన జమ్ము- కశ్మీర్ కాంగ్రెస్ లో కదలిక తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సహం నింపేందుకు, ఎన్నికల పోరాటంలో పాల్గొనేందుకు సమాయత్తం చేస్తున్నారు. 370వ అధికరణ రద్దు నుంచి రాష్ర్ట పార్టీ శ్రేణుల్లో ఒకింత అనాసక్తి, గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. హస్తినలోని అధిష్టాన పెద్దలు సైతం ఈ దిశ గా చొరవ చూపని మాట వాస్తవం. అదే సమయంలో మూడు ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఏ అధికరణల రద్దు నుంచి వివిధ రకాల కార్యక్రమాలతో క్రియాశీలకంగా ఉన్నాయి. నిత్యం ఏదో పేరుతో ప్రజల్లోకి వెళుతున్నాయి. చర్చలు, ర్యాలీలు, సభలతో రాజకీయంగా చురుగ్గా ముందుకు సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో తాను వెనకబడ్డానని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వయంగా పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఆగస్టు 9,10తేదీల్లో రాష్ర్టంలో పర్యటించారు. రెండురోజుల పర్యటనలో భాగంగా తొలుత 9వ తేదీన ఆయన రాష్ర్ట రాజధాని నగరం శ్రీనగర్ చేరుకున్నారు. రాష్ర్టంలోని ప్రధానమైన ముస్లిం, హిందూ ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్య కశ్మీర్ లోని గండేర్బల్ ప్రాంతంలోని ప్రసిద్ధ మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు జరిపి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో రాజకీయ వ్యూహం ఇమిడి ఉంది. మితిమీరిన మైనార్టీ పక్షపాత ధోరణి కారణంగా అటు జాతీయస్థాయిలో ఇటు రాష్ర్టంలో హిందువులు పార్టీకి దూరమయ్యారు. దీంతో వారు భాజపాకు చేరువయ్యారు. కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు జమ్ములో హిందువుల సంఖ్య అధికం. ఈ విషయాన్ని చక్కదిద్దేందుకు కశ్మీరీ పండిట్లకు, హిందువులు పవిత్ర స్థలంగా భావించే భవానీ మాత ఆలయాన్ని సందర్శించారు. 2014 ఎన్నికల్లో మొత్తం 87కు గాను భాజపా కేవలం హిందువుల ఓట్ల కారణంగానే 25 సీట్లు సాధించి పీడీపీ (28 సీట్లు) తరవాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.శ్రీనగర్ లోని ప్రఖ్యత హజ్రత్ బల్ మసీదునూ రాహుల్ సందర్శించారు. ముస్లింల ఓట్లు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మధ్య చీలగా హిందువుల ఓట్లు గంపగుత్తగా 2014లో భాజపాకు పడ్డాయి. ఫలితంగా కాంగ్రెస్ 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లకే పరిమితమైంది. దీంతో తనకు హిందువులు, ముస్లిములు ఒకటేనని చాటేందుకే ఆలయం, మసీదు సందర్శన ద్వారా రాహుల్ సమతూకం పాటించినట్లు స్పస్ఫ్టమవుతోంది. తమది కశ్మీరేనని తొలి రోజుల్లో తమ కుటుంబం ఇక్కడే గడిపిందని జీలం నది జలాలను తాగిందని సెంటిమెంటు రంగరింపజేశారు.అనివార్య కారణాల వల్ల ఇక్కడి నుంచి అనంతరం అలహాబాద్ తరవాత ఢిల్లీకి మకాం మార్చామని, కశ్మీర్ కు వస్తే తనకు సొంత ఇంటికి వచ్చిందన్న భావన కలుగుతుందని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా శ్రీనగర్ లో కొత్తగా నిర్మించిన కాంగ్రెస్ భవన్ ను ప్రారంభించారు. పీసీసీ చీఫ్ గులాం మహమ్మద్ మీర్ కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. మీర్, పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. వర్గపోరు పార్టీకి పెద్ద ప్రతిబంధకంగా మారింది. రాహుల్ ప్రయత్నం ఎంతవరకు విజయవంతమైందో తెలియాలంటే కొంతకాలం వరకు వేచి చూడక తప్పదు.

Related Posts