YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఎట్టకేలకు.. తెరుచుకోనున్న పాఠశాలలు

ఎట్టకేలకు.. తెరుచుకోనున్న పాఠశాలలు

ఆగస్టు 28, 
సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు పాఠశాలలు తెరుచుకొనున్నాయి. కరోనా కారణంగా పాఠశాలలు రెండేళ్లుగా మూతపడ్డాయి. కేవలం ఆన్లైన్ క్లాసుల ద్వారా మాత్రమే కొద్దిరోజుల పాటు విద్యాబోధన సాగింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం, పక్క రాష్ట్రాలలో పాఠశాలలు రీ ఓపెన్ చేయడంతో రాష్ట్రంలో కూడా ప్రత్యక్ష తరగతుల ద్వారా విద్యాబోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని, దానికోసం పాఠశాలలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కరోనా విలయతాండవం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో జిల్లా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచింది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా ఆన్లైన్ ద్వారా విద్యాబోధన జరిగేలా చూసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆన్లైన్ తరగతులను రద్దు చేసి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.జిల్లాలో మొత్తం 1,186 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 1,011 ఉండగా.. ఇందులో 188 జిల్లా పరిషత్, 175 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 126 యూపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాఠశాలల పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. పాఠశాలల ఆవరణలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దర్శనమిస్తున్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయింది.ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే తరగతి గదుల పరిస్థితి దారుణంగా మారింది. పాఠశాలల తరగతి గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. తరగతి గదుల పై కప్పులు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. గదుల డోర్లు, కిటికీలు ధ్వంసమయ్యాయి. మూత్రశాలలు దుర్వాసన వస్తున్నాయి. వాటికి డోర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తయారయ్యాయి.రెండేళ్లుగా పాఠశాలలను ఉపాధ్యాయులు గానీ, అధికారులు గానీ పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేయడంతో అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం మానేశారు. దాంతో పాఠశాలలు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. తాగి పడేసిన మందు బాటిల్స్ ముక్కలు పాఠశాలల ఆవరణలో దర్శనమిస్తున్నాయి. పాఠశాలలు మందుబాబులకు అడ్డాగా కూడా మారాయంటే అధికారుల పర్యవేక్షన ఏ విధంగా ఉందో అర్ధం అవుతోంది.జిల్లాలో 1,011 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 250 పాఠశాలల్లో గదుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 708 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అదనంగా 886 తరగతి గదులు నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టుగా అధికారులు చెప్తున్నారు. శిథిలావస్థకు చేరిన గదుల సంఖ్య అనధికారికంగా ఇంకా ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం వీటిని కూల్చివేసే పరిస్థితులు ఆయా పాఠశాలల్లో నెలకొన్నాయి. ఉన్న గదులను కూల్చివేయడానికి నిధుల ఇబ్బంది ఉందని వెనకడుగు వేస్తున్నారు. పైగా శిథిలావస్థకు చేరిన ఆ గదులు ప్రస్తుతం స్టోర్ రూములుగా ఉపయోగపడుతున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలను రద్దు చేసి ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వడంతో పాఠశాలల పరిశుభ్రతపై అధికారులు దృష్టిపెట్టారు. ప్రతీరోజు ఉదయమే పాఠశాలకు వెళ్లి స్థానిక పంచాయతీ పాలక వర్గం సహాయంతో పాఠశాలల్లో వసతులను సమకూరుస్తున్నారు. పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. సర్పంచుల ఆధ్వర్యంలో పాఠశాలలను శానిటేషన్ చేస్తున్నారు.

Related Posts