YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పాము - కుండలిని రహస్యం.

పాము - కుండలిని రహస్యం.
మన సంప్రదాయంలో పాముని ఒక దేవతగా గుర్తిస్తారు. ఎటువంటి గుళ్ళలో అయినా సరే, పాముల విగ్రహాలు ఉంటాయి. ఇంతకి ఈ పాముకి, ఆధ్యాత్మిక ప్రక్రియకి ఉన్న సంబంధమేమిటి, ఎందుకు ఈ చిహ్నాన్ని వాడతారు అన్న ప్రశ్నకు సద్గురు సమాధానం చెబుతున్నారు.
"కుండలిని" అన్న మాటకి "శక్తి" అని అర్థం. అది మనిషిలో అంతర్లీనంగా ఉంటూ బయటకి కనిపించకుండా ఉండే శక్తి. యోగ సంప్రదాయంలో ఈ కుండలిని ఎప్పుడూ చుట్టచుట్టుకుని ఉన్న నాగుపాముకు ప్రతీకగా సూచిస్తారు.
చుట్టచుట్టుకుని ఉన్న నాగుపాముకి చాలా ఉన్నత స్థాయిలో నిశ్శబ్దం యొక్క శక్తి తెలుసు. పాము కదలకుండా పడుకున్నప్పుడు అది ఎంత నిశ్చలంగా ఉంటుందంటే, అది మీదారిలో ఉన్నా దాన్ని మీరు గుర్తించలేరు. అది కదిలినప్పుడే మీరు దాన్ని గమనించగలరు. కానీ ఈ చుట్టలు చుట్టుకున్న పాములు, లోపల నిద్రాణంగా ఉన్నా కూడా చలనశీలతని కలిగి ఉంటాయి. కుండలిని చుట్టలుచుట్టుకున్న నాగుపాముగా ఎందుకు సూచిస్తారంటే, ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి నిద్రాణంగా ఉంది, అది ప్రత్యక్షంగా కనిపించదు, అది కదిలితేనే తప్ప అసలు ఉన్నట్టు కూడా మనం ఊహించలేనట్టు ఉంటుంది.
మీ శక్తులన్నీ నిశ్చలంగా ఉంటే, పాములు మీ వైపు ఆకర్షింపబడతాయిమీరు పరిపూర్ణమైన భౌతిక జీవితం జీవించాలంటే, మీకు మీ శరీరానికున్న శక్తిలో ఒక లేశము సరిపోతుంది.
మీకు ఈ భౌతిక సరిహద్దులు దాటాలనుకుంటేనే మీకు అఖండమైన శక్తి అవసరం పడుతుంది. అది మిమ్మల్ని ప్రస్తుత వాస్తవంలోంచి బయటకు తీసుకుపోతుంది. అది విమాన ప్రయాణానికీ, రాకెట్ ప్రయోగానికీ మధ్య ఉన్న తేడా లాంటిది. వాతావరణం పరిధిలోనే ప్రయాణించడం ఒక ఎత్తు, వాతావరణ సరిహద్దుని ఛేదించుకుని, గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్ళడం ఒక ఎత్తు. ఆ విధంగానే, శరీరం పరిమితులని దాటి వెళ్ళాలంటే, మరో ప్రమాణానికి చెందిన శక్తి ఆవశ్యకం అవుతుంది.
భారతదేశంలో పాము చిహ్నం లేని గుడి ఉండదు. దానికి కారణం ఈ సంస్కృతి పాముల్ని పూజిస్తుందని కాదు. ప్రస్ఫుటం కాకుండా మీలో దాగున్న శక్తిని మేల్కొలుపుతుందని చెప్పడానికి సంకేతమే ఆ పవిత్ర స్థలం. పాములు చాలా విశేష దృష్టిగలవి. (దానికి ఒక కారణం అవి వినలేవు. కేవలం ప్రకంపనలను మాత్రమే గ్రహించచగలవు.) పాములు ధ్యాన నిమగ్నమైన వ్యక్తివైపు ఆకర్షించబడతాయి. మన సంప్రదాయంలో, యోగులెక్కడైనా ఒకచోట కూర్చుని ధ్యానం చేస్తే,  అతనికి దగ్గరలోనే ఒక పాము ఉంటుంది. మీ శక్తులన్నీ నిశ్చలంగా ఉంటే, పాములు మీ వైపు ఆకర్షింపబడతాయి.
కుండలినిని మీరు ప్రజ్వలించగలిగితే, అది జీవితానికి ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలకు ద్వారం తెరుస్తుంది.
పాముకీ, మనిషికీ భౌతికంగా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ, శక్తి వ్యవస్థకి సంబంధించినంత వరకు ఇద్దరికీ సామ్యం ఉంది. మీకు అడవిలో ఒక నాగుపాము ఎదురైతే, అది మీ చేతుల్లోకి ఏ ప్రతిఘటనా లేకుండా రావడం గమనిస్తారు. ఎందుకంటే దాని శక్తులూ, మీ శక్తులూ ఒకదానితో ఒకటి సరిపోలి ఉంటాయి కనుక.  ఒక వేళ మీ శరీర రసాయనకత ఏ మాత్రమైనా భయాన్ని సంకేతిస్తేనే, అది దాన్ని ప్రమాద హెచ్చరికగా గుర్తిస్తుంది గనుక కాటేస్తుంది. లేకపోతే అది దాని విషాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. అదే దాని సంపద. ఆధునిక వైద్యం నాగుపాము విషంలో ఉన్న ఔషధ తత్త్వాన్ని బహువిధాల గుర్తించింది.
కుండలినిని మీరు ప్రజ్వలించగలిగితే, అది జీవితానికి ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలకు ద్వారం తెరుస్తుంది.
సంప్రదాయ సిద్ధమైన ఆదియోగి శివుని విగ్రహాలు, ఆయనతొ పాటు పాముని చూపిస్తాయి. అది ఆయన దృష్టి అత్యంత ఉన్నత స్థాయిలో ఉండడాన్ని సూచిస్తుంది. శక్తి తీవ్రత ఒక స్థాయికీ, పరిమాణానికీ చేరుకుంటేనే, సత్యాన్ని ఏ దోషం లేకుండా గ్రహిస్తారు. అలా లేనపుడు, మనకున్న కర్మ సంబంధమైన వాసనలు (అవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట ఏక కణ జీవులుగా ప్రారంభమైన నాటినుండీ మనకు సంక్రమించినవి) మనం వాస్తవాన్ని పరిశీలించడంలో, అవగాహన చేసుకోవడంలో అడ్డుగా నిలబడతాయి.
పరమాత్మ యొక్క వ్యక్తరూపమే ప్రకృతి అని, అన్నింటిలోనూ ఆయా ఉపాధుల ద్వారా, పరమాత్మతత్త్వం వ్యక్తమౌతుందన్న విశ్వాసం భారతీయులది. అందుకే మన దృష్టిలో, ప్రకృతిలోని సర్వజీవులు, సర్వ పదార్ధాలూ పూజనీయమే.  ప్రకృతిలో కనిపించే ప్రతీజీవికి, అవి మనకు చేసే మేలుకు కృతజ్ఞతగా -  సందర్భానుసారంగా పూజలు చేస్తుంటాం. ఇది మన ఔనత్యం. ఇంతటి మహత్త్వభావన విశాలవిశ్వంలో భారతీయులకే సాధ్యమైంది. పంచభూతాలను, సముద్రమును, పర్వతాలను, వృక్షాలను, గోవులను, సర్పాలను, విగ్రహాదులను ఆరాధించడం ప్రాచీనకాలం నుండి వస్తున్న సంప్రదాయం. సనాతనధర్మంలో - సమస్తాన్ని భగవన్మయంగా భావించడం, పూజించడం ఓ భాగం. పూజలు చేయడం వలన, సాత్త్వికమైన మనస్సుతో పరమార్ధ విచారణ చేయడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది.
నాగుల చవితి
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
నాగుల చవితి రోజున నాగేంద్రునిని శివభావముతో అర్చిస్తే, శారీరకరోగాలు  తగ్గుతాయని, సౌభాగ్యవంతులవుతారని, సర్పపూజ చేసే వారి వంశం చక్కగా వర్ధిల్లుతుందని పెద్దలు చెప్తుంటారు.
నాగారాధన - వేదకాలం నుండి ఉంది. నాగేంద్రుడు శివునికి ఆభరణముగా, శ్రీమహావిష్ణువుకు శయ్యగా ఉన్నాడు. నాగులు బ్రహ్మదేవునికి పౌత్రులు (మనవళ్ళు). కనుక నాగరాజున్ని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్లేనని పెద్దల వచనం.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, సాధరణంగా సర్పాలను చాలామంది దేవతలు ఆభరణంగా ధరిస్తారు. వినాయకుడి వడ్డాణం, యజ్ఞోపవీతం సర్పమే. ఇక, సుబ్రహ్మణ్యుడునయితే... నాగస్వరూపునిగా పూజిస్తారు. జంటపాములును సుబ్రహ్మణ్యుడే అని ఆరాధిస్తుంటారు.
ఇక, సర్పపూజ విషయానికి వస్తే - ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణిని అనవసరంగా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతుంటుందనే ఓ చక్కటి సందేశంకు దర్పణం సర్పపూజ. 
పుట్టను పూజించడం, పాలు తేనె పోయడం...రావి వేప చెట్ల దరి, నాగప్రతిష్ఠ చేసి ప్రదక్షిణాలు చేసి పూజించడం... వీటన్నిటిలో ఎన్నో ఆరోగ్యకర, వైద్య, విజ్ఞాన రహస్యాలున్నాయి.
తలస్నానం చేసి ఉపవాసంతో వుండి పెసలు/పెసరపప్పు, మొలకెత్తిన/నానబెట్టిన అపక్వాహారంతో పాటు నువ్వులు దంచి, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి ప్రసాదమును, బియ్యపుపిండి బెల్లం కలిపి చేసిన చలివిడి మొదలగునవి నాగులకు నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తారు.
 ఎందుకంటే - పుట్ట దరికి వెళ్లడం, తాకడం, పుట్టమన్ను వాసన పీల్చడం వలన మరియు ప్రసాదములుగా పెట్టిన పై పదార్ధములు తినటం వలన, స్త్రీలకు నాడీమండలం శుద్ధై, సంతానోత్పతికి అవసరమైన శక్తులు వృద్ధి అవుతాయని, గర్భధారణకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయని ఆయుర్వేదం తెలుపుతుంది. ఈ కారణం చేతనే, సంతానం లేనివాళ్ళు నాగపూజలు, నాగప్రతిష్టలు చేసే ఆచారాన్ని పూర్విజులు ప్రతిపాదించారు. అలాగే పుట్ట బంగారం (పుట్ట మన్ను) చెవులకు రాసుకుంటారు. పుట్టలోకి పాములు వెళ్లి వస్తున్నప్పుడు పుట్ట అంచులకు శరీర రాపిడితో పాములనుండి స్రవించే ద్రవం ఆ మట్టికి అంటి ఓ ఔషధంలా పనిచేస్తుందని చెప్తుంటారు.
కుండలినీ శక్తికి ప్రతీకగా నాగేంద్రుని ఆరాధిస్తున్నాం. యోగ- మంత్ర శాస్త్రాలను పరిశీలిస్తే- శివశక్త్యాత్మకమైనది కుండలిని. అది ఆరు చక్రాల నుండి ప్రసరించే చైతన్యం, ఇదే 'షణ్ముఖస్వామి'గా దీపించే సర్పరూప చైతన్యం. పౌరాణికంగా కుమారస్వామి కొంతకాలం, ఒక 'వల్మీకం'లో సర్పరూపంగా తపస్సు చేసిన గాథ ఉంది. తదాదిగుణంగా ఆయనను సర్పంగా ఆరాధించడం సంప్రదాయమయ్యింది.
మరొక కధనం  ప్రకారం... కార్యోణ్మకుడైన సుబ్రమణ్యం స్వామి  నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలస్తాడు. "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
'సుష్ఠు బ్రహ్మణ్య' - సుబ్రహ్మణ్య. వేద మంత్రములన్నిటిచేత 'సుష్ఠు'గా (పరిపూర్ణంగా) తెలియబడే పరతత్వం - 'సుబ్రహ్మణ్యుడు'. వేద, యజ్ఞ, తపో, జ్ఞానాలకు 'బ్రహ్మము' అని పేరు. వాటిని శోభనముగా (చక్కగా) రక్షించువాడు సుబ్రహ్మణ్యుడు అని అర్ధం.
*ఆధ్యాత్మిక అంతరార్ధం *
మన శరీరాన్ని నవరంద్రాలున్న పుట్టగా పోల్చుతారు. పుట్ట క్రిందభాగం విశాలంగా వుండి పోను పోను సన్నగా ఎలా అయిపోతుందో, అలానే మనం కూర్చున్నప్పుడు మన దేహాకృతి వుంటుంది.
మన దేహంలో ఉండే మనస్సుకు కేంద్రం మెదడు. ఈ మెదడు పాముపడగ ఆకారంలో వుంటుంది. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని వ్యవహరిస్తారు.
 కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం చెబుతోంది. 'కుండల'మంటే పాముల చుట్ట. పుట్ట అడుగున చుట్ట చుట్టుకొని పాము  ఉన్నట్లే, మన శరీరంలోనూ మూలాధార చక్రమునందు కుండలినీ శక్తి చుట్ట చుట్టుకున్న పాములా ఉంటుంది. ఈ కుండలినీ శక్తిని సాత్త్విక విధానంలో ఉద్ధీపింపజేయడమే నాగపూజ పరమార్ధం.
తలనుంచీ తోకవరకు మెలికలు ఉన్న రెండుపాముల రాయి ఒకటి రావిచెట్టు క్రింద ఉండడం కొన్ని దేవాలయాల్లో చూస్తుంటాం. ఆ విధంగానే కుడి ఎడమ ముక్కు రంద్రాలతో పీల్చేగాలి, పింగళ ఇడ నాడుల ద్వారా, పాములు మెలిక వేసుకొని ఉన్నట్లు శరీరంలోనికి పోయి, సంచరిస్తూ వుంటుంది.తమో రజో గుణాలనే విషాన్ని పాము చిమ్మకూడదని, సత్త్వగుణంతో ఉండి మనల్ని రక్షించాలని ప్రార్ధిస్తూ, సత్త్వగుణ ప్రతీకయైన పాలును పుట్టలో ఎలా వేస్తున్నామో... అలానే, మనలో  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, రజో తమో గుణాలు క్షయమై సత్త్వగుణ సంపత్తి పెంపొందించుకోవడానికి, భగవత్ భక్తి అనే క్షీరాన్ని పోయాలని పెద్దలు పేర్కొంటారు.
కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.
శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది.
మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.
నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.
ఒకోసారి మన దేవతామూర్తులను పరిశీలిస్తే, చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. వారు చెంత కొలువై ఉన్నవి ... పరస్పర శతృవర్గం వారు.  విష్ణువుకు ఆదిశేషువు శయ్య కాగా, గరుత్మంతుడు వాహనం.  ఒకే ఇంట ఉన్న - శివునికి, వినాయకునికి పాములు ఆభరణములు కాగా, కుమారస్వామికి వాహనం నెమలి. ఆపై అమ్మవారో...నకులేశ్వరి (నకుల అంటే ముంగిస). ముంగిస స్వరూపంలో కూడా అమ్మ వారు ఉంటారట. అంతేనా...మానవదేహమునందలి వెన్నెముక యందు కుండలినీ శక్తిగా సర్పాకారంలో ఉన్నదీ...  ఆ శ్రీవిద్యా స్వరూపిణి జగన్మాతయే.
పాముకు ప్రధాన శతృవులు - గరుడపక్షి, నెమలి, ముంగిస. మరి ఇవన్నీ మనం ఆరాధించే దేవతల చెంతనే ఉండడం వెనుక మర్మమేమిటి? 
అధోగతి పట్టించే అంశాలను సంహరించే స్థితిని దేవతలు అనుగ్రహిస్తారు. అందుకే మనకు అనుకూల్యతగా శతృత్వం ఉన్న వాటిని తమకి ఆభరణాలుగా, వాహనములుగా మలుచుకుంటారు.
వాటి  ద్వారా మన పంచేంద్రియాలతో అపసవ్యంగా చరించే మనస్సును సవ్యదిశలో నడిపిస్తారు. దీనిని కాస్త కూలంకుషంగా  పరిశీలిద్దాం -
సృష్టిలో ప్రతీ అంశంలో అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, మనలో ఉన్న కుండలినీ  సర్పములో కూడా అనుకూలత, ప్రతికూలతల అంశాలు ఉంటాయి.  అనుకూలతగా ఉన్న అంశం ఉద్ధరణలోనికి తీసుకొస్తే,  ప్రతికూలతగా ఉన్న అంశం  క్షీణింపచేస్తుందని పేర్కొంటారు.
క్షీణింపచేసే అంశం - మనలో తేజస్సుని ఇంద్రియలౌల్యం కొరకు క్షయం చేసే సర్పం. ఇది శరీరంలో మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. బుద్ధిని మందగింపజేస్తుంది. బ్రహ్మమునందు నిలబడనీయదు. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. తేజస్సుని అదోముఖంగా క్రిందకు వెళ్ళేటట్లు చేస్తుంది. తత్ఫలితంగా పురోగతి చెందలేం. భగవంతున్ని చేరుకునే దిశగా వెళ్ళలేం.
ఉద్ధరణలోనికి తీసుకొచ్చే అంశం - భగవంతుని యందు భక్తితో బ్రహ్మచర్యమందు పూనికతో ఉండేటట్లు చేస్తుంది. తేజస్సును ఓజస్సుగా మార్చుతుంది. ఉన్నతపధం వైపు నడిపిస్తుంది.
జన్మ సార్ధకతకు కావల్సిన స్థితిని పొందాలంటే కేవలం మనశక్తే సరిపోదు. ఈశ్వరశక్తి కూడా తోడవ్వాలి. అందుకై భగవంతున్ని త్రికరణశుద్ధిగా ప్రార్ధించాలి.
అలా ప్రార్ధించినప్పుడు ప్రతికూలత అంశాలను సంహరింపజేసి, అనుకూలత అంశాలను ప్రేరేపించడానికి దోహదపడేవి దేవతల చెంతనున్న ఆ శతృవర్గం వారే. ఎలాగంటే - 
శ్రీహరిని ఆశ్రయిస్తే, ఆయన వాహనమైన గరుత్మంతుడు సర్పంలో ప్రతికూలత అంశాలను సంహరించి, అనుకూలతను  ప్రేరేపిస్తాడు.
శివున్ని, అమ్మవార్ని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యుడుని ప్రార్ధిస్తే -
జగన్మాత, ముంగిస రూపంలో వచ్చి, కుండలిని రూపంలో ఉన్న సర్పంలో ప్రతికూలతాంశాలను సంహరించి అనుకూలతాంశలను ఉద్ధీపనజేస్తుంది.  లేదా సుబ్రహ్మణ్యుడు తన వాహనమైన నెమలి ద్వారా, ప్రతికూల అంశాలను సంహరించి అనుకూలతను  పురోగమింపచేస్తాడు.
పుట్టకు వెళ్ళడం ఏమిటీ...పూజించడం ఏమిటీ...
పుట్టలో పాలు పోయడం  ఏమిటీ...మూఢ నమ్మకాలు...అని కొందరు విమర్శించడం విన్నాను. అయితే మన పెద్దలు దేనినీ ఊరకనే చెప్పరు. వారు చెప్పినదాంట్లో పరమార్ధం మనకు తెలియకున్న, మన శ్రేయస్సుకై చెప్పారన్నది సత్యం.
మన ఆచారాల వెనుకనున్న ఆంతర్యాన్ని గ్రహిస్తే ... భారతీయుల జ్ఞాన విజ్ఞాన దృష్టి ఎంత సమున్నతమైందో అర్ధమౌతుంది.

Related Posts