YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నానికి ప్రమోషన్..

నానికి ప్రమోషన్..

విజయవాడ, డిసెంబర్ 16,
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల తగ్గింపుపై జగన్ సర్కారుకు హైకోర్టు షాకిచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత లౌక్యంగా మాట్లాడుతూ.. ప్రత్యర్థులపై నేరుగా ఎదురుదాడికి దిగే పేర్ని నానికి సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 35ను ఏపీ హైకోర్టు కొట్టేసిన తరుణంలో.. ఈ తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి పేర్ని నానికి అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ.. నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌లోని ఆర్టికల్ 166, క్లాజ్ (3), రూల్ 6, సబ్ రూల్ (1) కింద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి పేర్ని వెంకట్రామయ్యకి కేటాయించినట్లు వివరించారు.ప్రస్తుతం పేర్ని నాని ఆధీనంలో రెండు కీలక శాఖలు ఉన్నాయి. రవాణా, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖలను ప్రస్తుతం పేర్ని నాని పర్యవేక్షిస్తున్నారు. దీనికి అదనంగా కొత్తగా సినిమాటోగ్రఫీ శాఖ వచ్చి చేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో ట్రబుల్ షూటర్‌గా పేర్ని నానికి పేరు ఉంది.కొన్ని కీలక, వివాదాస్పద, సున్నిత అంశాలను ఆయన సునాయాసంగా పరిష్కరించగలిగారనే గుర్తింపు ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో పేర్ని నాని మరింత దూకుడుగా వెళ్తారు. అలాగే, కొన్ని వివాదాస్పద అంశాల్లో సైతం పేర్ని నాని అత్యంత చాకచక్యంగా మాట్లాడతారనే పేరుంది. ఈ తరుణంలో సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను పేర్ని నానికి అప్పగిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Related Posts