YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంటర్ స్టూడెంట్ప్.. సంగతి ఏంటీ

ఇంటర్ స్టూడెంట్ప్.. సంగతి ఏంటీ

హైదరాబాద్, డిసెంబర్ 20,
ఇంటర్ ఫలితాలపై విద్యార్థి సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశాయి. అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ప్రతిపక్షాలు సైతం ఈ అంశాన్ని విమర్శనాస్త్రంగా ఎంచుకున్నాయి. రాష్ట్ర సర్కార్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. శనివారం ఇంటర్మీడియట్ బోర్డును ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ నేతలు ముట్టడించారు. దీంతో కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్అటు బోర్డును, ఇటు ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా మారడంతో ఏం చేద్దాం, ఎలాంటి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో బోర్డు, తెలంగాణ సర్కార్ పడినట్లు తెలుస్తోంది. 4.59 లక్షల మంది పరీక్షలు రాస్తే.. ఏకంగా 2.35 లక్షల మంది ఫెయిలవటంతో ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ కారణంగా రెండేండ్లు విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. దీంతో వారిని ప్రమోట్ చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.తీరా సెకండియర్ పాఠాలు జరిగే టైమ్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పెట్టడంతో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఇంటర్ బోర్డు కూడా అంచనాకు వచ్చింది. అందుకే ఫలితాలను వెల్లడించేందుకు సైతం బోర్డు జాప్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. ఫలితాలు వెల్లడించిన తర్వాత రాష్ట్రమంతటా దుమారం చెలరేగటంతో ఇటు ఇంటర్ బోర్డు.. అటు ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఇప్పుడేం చేద్దామనే విషయమై ఉన్నత స్థాయిలో తర్జన భర్జనలు మొదలయ్యాయి.ఇంటర్ బోర్డు వ్యవహారంపై దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు సీఎం కేసీఆర్ కు పంపించినట్లు తెలుస్తోంది. మొత్తం ఫెయిలైన స్టూడెంట్లను కూడా మినిమమ్ మార్కులతో పాస్ చేయడం.. లేదా ఉచితంగా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ సదుపాయం కల్పించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. అవే ప్రతిపాదనలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రికి ఫైల్ను అందజేసినట్లు తెలిసింది. సీఎం తీసుకునే తుది నిర్ణయం మేరకే చర్యలుంటాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ఇదే జరిగితే 51 శాతం ఫెయిలైన విద్యార్థులకు ఊరట లభించనుంది. సీఎం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే.. ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్లో జరిగే పరీక్షల్లోనే ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ పరీక్షలు రాయాల్సిందే. కేవలం నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈలోగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే ప్రసక్తి లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈసారి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును సగానికి తగ్గించినట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.ఫైయిలైన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ నాయకులు ఇంటర్బోర్డు, విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని వారు డిమాండ్లు చేశారు. ఇంటర్ విద్యార్థుల మృతికి కారకులెవరని ప్రశ్నించారు. కరోనా వల్ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తున్నాం అని చెప్పి మాట తప్పి పరీక్షలు నిర్వహించడం వల్లే 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ఇంటర్మీడియట్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణలో ఇంటర్ బోర్డు విఫలమైందని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలబస్ పూర్తి చేయకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, బోర్డు కారణమయ్యాయన్నారు. విద్యార్థి సంఘాల నేతలు కార్యాలయాలను ముట్టడించి బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

Related Posts