YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆశాజనకంగా కంది దిగుబడులు

ఆశాజనకంగా కంది దిగుబడులు

అదిలాబాద్, జనవరి 27,
అదిలాబాద్ జిల్లాలో సాగునీటి వనరులు తక్కువగా ఉండడంతో రైతులు వానాకాలం పంటలను మాత్రమే సాగు చేస్తారు. ఈ సీజన్‌లో వర్షాలపై ఆధారపడి పత్తి, సోయాబీన్, కంది పంటలను రైతులు పండించారు. రైతులు కష్టపడి సాగుచేస్తున్న పంటలు దళారుల పాలు కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పంటల దిగుబడులు రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రకటించిన కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే పంటకు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తామంటే వారికి మార్కెట్ యార్డుల్లో అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు ప్రయోజనం చేకూరేలా చూస్తున్నారు.ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు సాగుచేసిన సోయాబీన్ పంట కొనుగోళ్లు ముగియగా పత్తి విక్రయాలు సైతం చివరిదశకు చేరుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ద్వారా సోయాబీన్ కొనుగోలు చేయగా పత్తిని ప్రైవేటు వ్యాపారులు ఎంఎస్‌పీ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చే శారు. జిల్లా వ్యాప్తంగా కంది పంట దిగుబడులు ప్రా రంభం కాగా పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ని ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఆరు మార్కెట్‌యార్డుల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఈ సారి కంది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరానికి ఎనిమిది నుంచి పది క్విం టాళ్ల వరకు పంట దిగుబడి వచ్చింది. సాధారణంగా పంట దిగుబడులు ఎక్కువగా ఉన్నప్పుడు రైతులకు దళారులు బెడద ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు సైతం పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. పంట చేతికి రాక ముందుగానే దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను ఏదో రకంగా మభ్యపెడుతారు. వారిని మచ్చిక చేసుకుని కనీస మద్దతు ధర కంటే క్వింటాకు రూ. 500 నుంచి రూ.800 వరకు తక్కువకు కొనుగో లు చేస్తారు. పంట నాణ్యత, తేమ పేరిట తూకంలో కోతలు విధిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలకు పంటను అమ్మకానికి తీసుకువచ్చిన తిరిగి తీసుకుపోలేక వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. ఇలా జిల్లాలో పత్తి, సోయాబీన్, కంది పంటలు విక్రయాల్లో రైతులు నష్టపోతుంటారు. ప్ర భుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లా వ్యాప్తంగా దళారుల దందాకు బ్రేక్ పడింది.ఏడాది కంది కొనుగోళ్ల విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఈ సారి కందికి రూ.5950 కనీస మద్దతు ధర ప్రకటించగా ప్రస్తుతం మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ 5వేల వరకు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నష్టపోకుండా వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్క్‌ఫెడ్ అధికారులు జిల్లా కేంద్రంతో పాటు జైనథ్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, బేల మార్కెట్‌యార్డుల్లో కంది పంటను కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆదిలాబాద్, జైనథ్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాగా మిగితా చోట్ల నేడు కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. దీంతో రైతులకు తమ పంటలను దళారులు, వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారాలకు పంటను విక్రయించుకుని కనీస మద్దతు ధర పొందుతున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లను పరిశీలిస్తున్నారు. దళారులు మార్కెట్ రాకుండా సిబ్బందిని నియమించారు. వీఆర్‌వో పంట ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, బ్యాంకు జిరాక్స్ లాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైతుల మాత్రమే తీసుకువచ్చిన పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts