YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కుంపట్లు

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కుంపట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 26,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి.. హైకమాండ్‌ మనసులో ఏముంది? పార్టీని ఏ రూట్‌లో తీసుకెళ్లాలనుకుంటోంది. నేతలకు ఎలాంటి డైరెక్షన్స్‌ ఇస్తోంది? రోజుకో కొత్త కమిటీ వేయడం వల్ల… పార్టీకొచ్చే ప్రాఫిట్‌ ఏంటి? సాధారణ హస్తం కార్యకర్తల్ని వేధిస్తున్న ప్రశ్నలెన్నో.. తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టానం మదిలో ఏముందో అర్థం కావడం లేదు. కొత్తకొత్త కమిటీలని ఏర్పాటు చేస్తూ… కొత్తకొత్త పదవుల్ని సృష్టిస్తూ.. గందరగోళంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింత అల్లకల్లోలంగా మారుస్తోందా? అనే టాక్‌ వినిపిస్తోంది. కొత్తగా సృష్టిస్తున్న పదవులు సీనియర్లను బిజ్జగించడానికా? లేక పార్టీ బలోపేతానికా? అర్థం కాని పరిస్థితి. దీనివల్ల నేతల మధ్య పుట్టుకొచ్చే అధిపత్య పోరు… పార్టీ ని నిలబెడుతుందా? సమస్యను మరింత జటిలం చేస్తుందా? అనే అనుమానం కలుగుతోంది.కాంగ్రెస్‌లో అంతే.. ఏ నేతకు ఎప్పుడు పదవి వస్తుందో, ఎప్పుడు పదవి ఊస్టవుతుందో అర్థం కాదు. పార్టీ బలోపేతం పేరుతో ముందుకెళ్తున్న హైకమాండ్‌.. ఏ పార్టీలో కనిపించనన్ని కమిటీలు వేసుకుంటా పోతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి, స్టార్ గా కంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచారక కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ ఉన్నారు. ఎలక్షన్‌ మేనేజ్మెంట్ కమిటీ, ఏఐసిసి కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా… పార్టీలో చేరికల సమన్వయం కోసం.. చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌ జానారెడ్డి. ఇక్కడే వ్యవహారం ముదురుతోంది. ప్రొటోకాల్ ప్రకారం తమది గొప్పంటే తమది గొప్పదంటూ కమిటీల నేతలు కాలర్‌ ఎగరేస్తున్నారంట. దీంతో, ఈ కమిటీలు చూసి కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్‌ మొదలైంది.ఒక్కో కమిటీకి ఒక్కో చైర్మన్‌… ఏంది సామీ ఈ కమిటీల గోల అనే చర్చ జరుగుతోంది టీపీసీసీలో. నెలకో కొత్త కమిటీ తయారవుతూనే ఉంది. సీనియర్లకి బాధ్యతలు ఇస్తూ.. అందరిని సంతృప్తి పరుస్తున్నారు సరే… కానీ, దీనివల్ల ప్రయోజనమెంత? అనేది మాత్రం హైకమాండ్‌ ఆలోచించడం లేదన్నది క్యాడర్‌ మాట. అనవసర వివాదాలే తప్ప.. ఒరిగేదేం లేదని మెజార్టీ వర్గం అభిప్రాయపడుతోంది. మరోవైపు, అగ్రనేత రాహుల్ వస్తుండటంతో.. జిల్లాల్లో ఈ నేతలు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. పర్యటన ఏర్పాట్లు , జన సమీకరణ పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ఇంచార్జ్ లకు, కార్యకర్తలకు కొత్త తలనొప్పి తెస్తున్నారు. ఏ నేత ఎప్పుడు వస్తారో? ఏం చెబుతారో? ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ కమిటీ చైర్మన్‌ అని ఒకరు.. ఈ కమిటీ చైర్మన్‌ అని ఒకరు… ఇలా రోజుకో నాయకుడొచ్చి హడావుడి చేస్తుంటే.. ఎవరి మాట వినాలో జిల్లానేతలకు, కార్యకర్తలకు అర్థం కావడం లేదంట.మొన్నటి దాకా అసంతృప్తితో రగిలిన సీనియర్లకు… రాహుల్ గాంధీ మీటింగ్‌ తర్వాత ఒక్కొక్కరిగా పదవులు వరిస్తుండడంతో.. వాళ్లంతా యాక్టివ్‌ అయిపోవడమే ఈ హడావిడికి కారణంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరికొందరికి పదవులు దక్కితే పరిస్థితి ఎలా మారుతుందోనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Related Posts