హైదరాబాద్ జూన్ 22
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాస్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. పదేండ్ల లోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక మిగతా వయసు గల వ్యక్తులు.. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలని ఆదేశించారు.అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లేని పక్షంలో ఇంటికే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారు తక్షణమే ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించి, మందులు వాడాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రయాణాలు చేకపోవడం మంచిదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.