YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనాని పైనే భారమంతానా....

జనసేనాని పైనే భారమంతానా....

విజయవాడ, నవంబర్ 22, 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పొత్తుల చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహంలా సింగిల్‌గానే పోటీ చేస్తామని చెప్తోంది. అంతేకాదు 2024 ఎన్నికల వేటలో మిగిలిన పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కకుండా మొత్తం వేటాడేస్తామంటోంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి గద్దె దించేందుకు విపక్షాలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వకూడదని అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇటు టీడీపీ అధినేత చందబ్రాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే పొత్తులు ఎలా ఉంటాయి అనేదానిపై మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ భవిష్యత్‌లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు ఉంటాయని జనసేన అవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనంతరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు పొత్తులపై చంద్రబాబు సైతం ఆహ్వానం పలికారు. అంతేకాదు విశాఖలో జరిగిన పరిణామాల అనంతరం చంద్రబాబు నేరుగా పవన్ కల్యాణ్‌ బస చేసిన హోటల్‌కు వెళ్లి మరీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నట్లు ఖాయమైపోయింది. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు అంటేనే ఒంటికాలిపై లేస్తోంది. అగ్రనాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ఎవరూ కూడా చంద్రబాబును కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. అక్కడితో ఆగిపోవడం లేదు. చంద్రబాబు ఒంటరి అని తెలిపేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని కూడా బీజేపీ ఉపయోగించుకుంటుంది. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను హైప్ చేస్తూనే మరోవైపు చంద్రబాబు బలహీనతలను బయటపెడుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు కోసం బీజేపీని వదులుకుంటారా లేక బీజేపీని టీడీపీతో పొత్తుకోసం ఒప్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో ఉమ్మడి స్వరం వినిపిస్తున్న విపక్షాలు.. ఇప్పుడు పొత్తుల విషయంలోనూ కలిసి సాగుతాయా లేక బీజేపీ -జనసేన పొత్తు మాత్రమే ఉంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఏకైక పొత్తు జనసేన-బీజేపీ మధ్య మాత్రమే. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ పొత్తు కొనసాగుతుంది. అయితే అది 2024 ఎన్నికల వరకు కొనసాగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే తరుణంలో జనసేనతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతుంది. పాత పొత్తును తిరిగి కొనసాగించేందుకు జనసేన, టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో పొలిటికల్ వేడిని రగిలిస్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల వ్యాఖ్యలను పరిశీలిస్తే భవిష్యత్‌లో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు అనివార్యంగా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తేనే వైసీపీకి గట్టిపోటీ ఇవ్వగలమన్న అంచనాకు ఇరు పార్టీల నేతలు వచ్చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మధ్య రాజకీయ సత్సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ మాత్రం కారాలు మిరియాలు నూరుతోంది. చంద్రబాబు అంటేనే యుద్ధానికి కాలుదువ్వుతుంది. అంతేకాదు పవన్ కల్యాణ్ తమ పార్టీతోనే ఉంటారని ఇతర పార్టీలతో ఉండరని ఢంకా భజాయించి మరీ చెప్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వమన్న పవన్ కల్యాణ్..చంద్రబాబుతో కలిసేందుకు దాదాపు రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇందుకు ససేమిరా అంటుంది. దీంతో బీజేపీని కూడా కలుపుకుని వెళ్తారా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇకపోతే రాష్ట్రంలో పొత్తుల లొల్లి గురించి క్లారిటీ రావాలంటే నోరు విప్పాల్సింది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రమే. ఇప్పటికే కమలదళంతో కలిసున్న జనసేనాని టీడీపీతో కూడా పొత్తులో ఉంటారా లేక బీజేపీని వదిలి టీడీపీతో జతకడతారా అనేది సస్పెన్ష్ గా మారింది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చేసింది. అంతేకాదు ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ ఏకంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పింది. అది కూడా బీజేపీతో మైత్రి సంబంధం నేపథ్యంలోనే. ఎన్డీఏలో భాగస్వామ్యంగా వ్యవహరించారు. కన్వీనర్‌గా చంద్రబాబు పని చేశారు. అలా బీజేపీతోనే కాదు జాతీయ స్థాయి నేతలందరితోనూ చంద్రబాబుకు మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో 2014 ఎన్నికల్లో మరోసారి బీజేపీతో కలిసి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం నరేంద్రమోడీ ప్రధానిమంత్రిగా ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీతో పొత్తు మూడునాళ్ల ముచ్చటగానే ముగిసింది. బీజేపీతో చంద్రబాబు విభేదించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని నరేంద్రమోడీని తిట్టిపోశారు. అమిత్ షా, మోడీలపై చేసిన వ్యా్ఖ్యలే ఇప్పుడు చంద్రబాబు కొంపముంచిందని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుందని తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబును బీజేపీ పొత్తుకు స్వాగతించడం లేదని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా టీడీపీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించే బాధ్యతలు పవన్ కల్యాణ్ తన భుజస్కందాలపై వేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ విషయంలో మారిన చంద్రబాబు వైఖరిని ఆ పార్టీ జాతీయ నేతలకు వివరించి పొత్తు కుదిర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం చంద్రబాబును స్వాగతిస్తే 2024 ఎన్నికల్లో 2014 సినారియోరిపీట్ అవుద్ది. ఇలా జరగాలంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మరి పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.జనసేన పార్టీతో కలిస్తేనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చనే ఉద్దేశం టీడీపీ నేతల్లో ఉంది. ఇప్పటికే చాలా మంది బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా కలిసి వెళ్తే ఇంకా బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధిస్తోందని ఈ నేపథ్యంలో కేంద్రం అండదండలు ఉంటే వైసీపీ వేధింపులకు అడ్డుకట్టవేయోచ్చని పలువురు సూచిస్తు్న్నారు. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో కొందరు నేతలు పవన్ కల్యాణ్‌తో వరుస భేటీలు అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఒప్పించే బాధ్యత మీదేనంటూ పవన్ కల్యాణ్‌ను కోరుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Related Posts