
హైదరాబాద్, మార్చి 16,
టీఎస్పీఎస్సీ లీకేజ్లో గందరగోళంగా తయారైంది పరిస్థితి. ఓవైపు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. మరోవైపు సిట్ విచారణ వేగవంతం చేసింది. అయితే అభ్యర్థులు మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నారు. లీక్ అయిన ఏఈ పరీక్షలను నిర్వహిస్తారా? తేదీ మారుస్తారా? టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సిట్ నివేదిక తర్వాతే తేలనుంది. అయితే ఏబీవీపీ కార్యకర్తలు మాత్రం టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఇక వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ వేసింది. దీంతో రంగంలోకి దిగిన సిట్.. టీఎస్పీఎస్సీలో దర్యాప్తు చేసింది. కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల నుంచి అన్నిరకాల వివరాలు సేకరించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్లో పరిస్థితిని గమనించారు. హ్యాక్ అయిన కంప్యూటర్లు, వాటి ఐపీ అడ్రస్లు సేకరించారు. చైర్మన్, కార్యదర్శి కంప్యూటర్లనూ పరిశీలించారు సిట్ అధికారులు. పేషీల్లో పనిచేసే ఇతర సిబ్బందిని ప్రవీన్, రాజశేఖర్ కదలికల గురించి ఆరా తీశారు.దాదాపు రెండున్నర గంటల పాటు టీఎస్పీఎస్సీలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ప్రవీణ్ దొంగలించినట్లు గుర్తించారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న రాజశేఖర్ సాయంతో పెన్ డ్రైవ్లో ప్రశ్నాపత్రాలు కాపీ చేసుకున్నాడు ప్రవీణ్. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శంకర్ లక్ష్మి కంప్యూటర్ ను బాగు చేసే క్రమంలో రాజశేఖర్ ఐపీ అడ్రస్లు మార్చేశాడు. డైనమిక్ ఐపి అడ్రస్ కు బదులు స్టాటిక్ ఐపిని కంప్యూటర్కు అనుసంధానం చేశాడు రాజశేఖర్. దీంతో ఆ ఐపీ అడ్రస్తో సిస్టమ్ను హ్యాక్ చేసి.. ఏఈ సివిల్ పేపర్ ను కాపీ చేసుకున్నాడు ప్రవీణ్. ఇదంతా చేసింది రేణుక కోసమే అని తెలుస్తోంది. ఆ తర్వాత చాలా మందిని ట్రాప్ లో పడేసినట్లు సమాచారం. చాలా మంది మహిళలతో ప్రవీణ్ కాంటాక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వారితో వీడియో కాల్స్ మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రవీణ్ రాసలీలలపై కూడా అధికారులు కన్నేశారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.సిట్ నివేదిక రాకపోవడంతో పరీక్షను రద్దుచేయాలా లేదా అనే విషయాన్ని తేల్చలేదు టీఎస్పీఎస్సీ. ఇప్పటికే పేపర్ లీక్ అయిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాని లిఖితపూర్వకంగా సిట్ నివేదిక ఇస్తే.. ఆతర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటోంది TSPSC. దీంతో 55వేల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.
కొంతకాలం క్రితం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రిపేర్ చేశాడు. ఆ సమయంలో డైనమిక్ ఐపీ అడ్రస్కు బదులు తనకు అనుకూలంగా స్టాటిక్ ఐపీని ఆ కంప్యూటర్కు అమర్చాడు. అనంతరం రాజశేఖర్ సాయంతోనే ప్రవీణ్ ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్లోకి కాపీ చేయించుకున్నాడు. ప్రశ్నాపత్రాలను తొలుత రేణుక, ఆమె భర్తకు రూ.10లక్షలకు ప్రవీణ్ విక్రయించాడు. రేణుక ఇచ్చిన రూ.10లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ అయ్యాయి. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో ఉన్న తన బాబాయ్ అకౌంట్కు రూ.3.5లక్షలు ట్రాన్ఫర్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు కమిషన్కు సమర్పించారు
ఆమరణ దీక్షకు దిగుతాం
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. లీకేజ్ కేసును టేకప్ చేసిన సిట్.. అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. పది రోజుల్లోనే కేసును ఓ కొలిక్కి తెస్తామని సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రవీణ్, రేణుక వ్యవహారం.. ఏయే ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు.. అనే విషయాలపై విచారణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో BSP రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్1 పరీక్షను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. టిఎస్పీఎస్సీ బోర్డుని రద్దు చేసి, తిరిగి కొత్తగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్లీక్కి పాల్పడి వేలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ సెక్రెటరీ దగ్గరికి ఎలా వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద పెద్ద మనుషులే ఉన్నారని BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.TSPSC దగ్గర హైటెన్షన్ నెలకొంది. పలు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు దశలవారీగా ధర్నాలకు దిగాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది ఏబీవీపీ. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనంతరం పీఎస్కు తరలించారు. లీకేజీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిచాంచాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలుజమొత్తానికి లీకేజ్ ఎపిసోడ్ తెలంగాణను కుదిపేస్తోంది