YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అలజడి రేపుతున్న కరోనా వైరస్

అలజడి రేపుతున్న కరోనా వైరస్

హైదరాబాద్, మార్చి 17, 
తగ్గిపోయిందనుకున్న కరోనా వైరస్ తిరిగి అలజడి రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా దేశంలో కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 754 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 నెలల తర్వాత ఇవే గరిష్ట కేసులు కావడం ఆందోళన కలిగించే అంశం. కోవిడ్తో కర్ణాటకలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మరణంతో కలిపి భారత్‌లో కోవిడ్ కారణంగా మృత్యువాతపడిన వారి సంఖ్య 5.30 లక్షలకు చేరుకుంది. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 4.46 కోట్ల (4,46,92,710)కు ఎగబాకింది.
దేశంలో ప్రస్తుతం 4,633 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన వారం రోజులుగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. ‘టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌’తో పాటు వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది.
✦ కొత్తగా కేసుల్లో పెరుగుదలకు కారణం కోవిడ్ కొత్త వేరియంట్ XBB.1.5 కారణమని భావిస్తున్నారు. XBB.1కి ఇది పరివర్తన చెందిన రకమని చెబుతున్నారు. చైనా, సింగపూర్, అమెరికాలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
✦ కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని, వైరస్ బారినపడిన వారిని గుర్తించి తగిన చికిత్స అందించాలని కేంద్రం సూచించింది.
✦ మహారాష్ట్రలో మరోసారి కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఎప్పటిలాగే ఈ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో మహారాష్ట్రలో కోవిడ్ కేసులు 355 నుంచి 668కి ఎగబాకాయి.
✦మహారాష్ట్రతో పాటు గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
✦ తెలంగాణలో ఒక్క రోజే 54 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు ఉన్నాయి.
✦ కోవిడ్‌తో పాటు వైరల్ ఫీవర్లు కూడా పంజా విసురుతున్నాయి. లక్షణాలు కూడా ఇంచుమించు ఒకేలా ఉండటంతో కరోనా మహమ్మారా? వైరల్ జ్వరమా అర్థంకాని గందరగోళ పరిస్థితి నెలకొంది.
✦ అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది.
✦ H3N2 వైరస్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తం మీద మళ్లీ మాస్కులు ధరించడం, గుంపులుగా గుమికూడకపోవడం లాంటి రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాల్సిన రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది.!

Related Posts