YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

హైదరాబాద్, జూన్ 3, 
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేష్.. కస్టడీ కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 10 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై నిందితుడి తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో డీఈ రమేష్  కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ మాస్ కాపీయింగ్ కు పాల్పడిన నిందితుడు భారీగా డబ్బు సంపాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.ఓ ఇన్విజిలేటర్ సాయంతో ప్రశ్నలు తెలుసుకున్న డీఈ రమేష్ బ్లూటూత్ సాయంతో పరీక్షా కేంద్రంలో కూర్చున్న వాళ్లకు సమాధానాలు చేరవేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సురేష్ అనే వ్యక్తి సాయంతో డీఏవో, ఏఈఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేసి చాలా మందికి అమ్ముకున్నట్లు దర్యాప్తులో తేలింది. రమేష్ తో చేతులు కలిపిన ఇన్విజిలేటర్లతో పాటు అతని నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వారిని గురించి కూడా కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే డీఈ రమేష్ ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే.. మరికొంత మంది గురించి తెలిసే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ ను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక దర్యాప్తు టీమ్ టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు దాంతో TSPSC Paper Leak కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరుకుంది. సోమవారం అరెస్టయిన వారిలో సైతం ఏఈఈ పేపర్ కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ఆదివారం రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు రవికిషోర్ నుంచి ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పేపర్లను కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే రమేష్ సైతం మరో 20 మందికి ఏఈఈ పేపర్ విక్రయించినట్లు చెప్పాడు. కోచింగ్ సెంటర్లో పరిచయమైన వారికి పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు వివరాలు సేకరించారు. రమేష్ ఇచ్చిన సమాచారంతో సోమవారం నాడు ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు రమేష్. అశోక్ నగర్‌ లోని ఓ కోచింగ్ సెంటర్ రమేష్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నాడు. అదే సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురికి ఏఈఈ పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఎగ్జామ్ హాల్ కు వీళ్లు బ్లూ టూత్ లతో వెళ్లారు. రమేష్ బయట నుంచి ఆన్సర్లు చెబుతుంటే రోబో, శంకర్ దాదా సినిమా సీన్ తరహాలో ముగ్గురు నిందితులు ఆన్సర్లు విని ఓఎంఆర్ లో బబులింగ్ చేసినట్లు గుర్తించి అధికారులు షాకయ్యారు. అసలు ఎగ్జామ్ హాల్ కు చిన్న వస్తువు తీసుకెళ్లినా అనుమతి లేదు, మరి నిందితులు బ్లూ టూత్ డివైజ్ లతో ఎలా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లారు.. ఏ సెంటర్ లో ఎగ్జామ్ రాశారు అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది సిట్. వీరికేనా ఇంకా ఎవరికైనా రమేష్ పేపర్ విక్రయించాడా, ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి ఇంకెంత మంది టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాశారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ జీవితాలు నాశనం అవుతున్నాయంటూ 30 లక్షల మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షలనైనా పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్ పీఎస్సీని కోరుతున్నారు.స్కూల్ పిల్లలు చెప్పే (A+B)2 ఫార్ములాలు సైతం ఏఈ ఎగ్జామ్ టాపర్లు చెప్పలేకపోయారు. కేవలం రెండు నెలల్లోనే ఎగ్జామ్ లో రాసిన ఆన్సర్లను చెప్పలేక కొందరు నీళ్లు నమిలారు. దాంతో ఏ స్థాయిలో పేపర్ లీక్ అయింది, మరిన్ని అరెస్టులు జరుగుతాయని అర్థమవుతోంది.

Related Posts