YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

నెల్లూరులో నిఫా భయం

నెల్లూరులో నిఫా  భయం

నిపా‘ వైరస్‌ ఇప్పుడు అందర్నీ వణికిస్తోంది. కేరళలో ఈ వైరస్‌ సోకి 11 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి వ్యాధి సోకిందనే వార్తలతో ప్రజల్లో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం స్పందించి హై అలర్ట్‌ జారీ చేసింది. జిల్లాలో కేరళకు చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. వీరు తరచూ సొంత రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వీరి బంధువులు సైతం జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.అప్రమత్తంగా లేకపోతే నిపా వైరస్‌ జిల్లాకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.నిపా వైరస్‌ గబ్బిలాలు,పందుల ద్వారా సోకుతుంది. గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నా, దాన్ని తాకినా వైరస్‌ సోకుతుంది. అలాగే గబ్బిలాలు పందులను పొడిచి గాయపరిచినప్పుడు వాటి నుంచి పందులకు సోకుతుంది. గాయపడిన పందులు జనసంచారంలో తిరగడం ద్వారా ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినా..దగ్గినా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కేరళకు చెందిన వారు పెద్ద ఎత్తున జిల్లాలో వివిధ వ్యాపారాల రీత్యా స్థిరపడ్డారు. వీరంతా వారి సొంత రాష్ట్రమైన కేరళకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి వారి బంధువులు కూడా ఇక్కడికి వస్తూ పోతుంటారు. కేరళ, త్రివేండ్రం, కొచ్చిన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నెల్లూరు మీదుగానే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణం చేసే వారిలో ఎవరికైనా ఈ వైరస్‌ సోకి ఉంటే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ల సమీపంలోని చెట్లలో పెద్ద ఎత్తున గబ్బిలాలు దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts