YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండియా కూటమి సమావేశం వాయిదా

ఇండియా కూటమి సమావేశం వాయిదా

న్యూఢిల్లీ డిసెంబర్ 5
ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. ఈనెల 6వ తేదీ బుధవారం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, కీలక నేతలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించాలని భావించారు. అయితే సమాజ్‌‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు ముందస్తు షెడ్యూల్‌ కారణంగా హాజరుకావడం లేదు. దీంతో ఇండియా బ్లాక్ సమావేశాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు.ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా ఎలయెన్స్ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం 6వ తేదీన జరపాలని నిర్ణయించారు. దీని తర్వాత డిసెంబర్‌లోనే అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో విపక్ష పార్టీల అధ్యక్షులు, ఇండియన్ అలయెన్స్ అధినేతల సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు.
సమాచారం లేదన్న ఎస్‌పీ, టీఎంసీ
కాగా, ఇండియా కూటమి సమావేశానికి తమ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన ఏదీ లేదని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి ప్రకటించారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కానీ, మరో నేత కానీ వెళ్లే అవకాశం ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అడిగినప్పుడు, ఇండియా కూటమి సమావేశం గురించి తమకు ముందస్తు సమాచారం లేదని ఆయన సమాధానమిచ్చారు. మరోవైపు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తనకు డిసెంబర్ 6న కోల్‌కతాలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున కూటమి సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు చెప్పారు. తమకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే కోల్‌కతా సమవేశాన్ని మార్చుకునే ఉండేవాళ్లమని తెలిపారు.
ఆసక్తి చూపని నితీష్
విపక్ష పార్టీల నేతలను స్వయంగా కలుసుకుని ఇండియా బ్లాక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం డిసెంబర్ 6వ తేదీ సమావేశానికి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఇండియా బ్లాక్‌కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బిజీగా ఉందని నితీష్ ఇటీవల విమర్శించారు.

Related Posts