YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

97 కోట్ల శిల్పాశెట్టి ఆస్తులు ఫ్రీజ్

97 కోట్ల శిల్పాశెట్టి ఆస్తులు ఫ్రీజ్

ముంబై, ఏప్రిల్ 19,
ఆర్థిక నేరాలకు పాల్పడే వారి పట్ల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఏమాత్రం చిన్న లొసుగు దొరికినా వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి మొదలుపెడితే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అయితే తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా చేరారు. బిట్ కాయిన్స్ కు సంబంధించి చేసిన మోసంలో గతంలోనే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తును ప్రారంభించారు. అంతేకాకుండా శిల్పా శెట్టి దంపతులపై చర్యలు ప్రారంభించారు. శిల్ప భర్త రాజ్ కుంద్రా కు చెందిన 97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేశారు. అందులో ముంబై మహానగరంలోని జుహు ప్రాంతంలో ఓ నివాస ఫ్లాట్ శిల్ప పేరు మీద ఉంది. దాంతోపాటు పూణేలో ఓ బంగ్లా, రాజ్ పేరు మీద ఉన్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రకటించారు.ముంబై నగరానికి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017 లో గెయిన్ బిట్ కాయిన్ పేరుతో మోసపూరిత పథకాన్ని నిర్వహించింది. బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెడితే నెలకు పది శాతం లాభాలు వస్తాయని ఆశపెట్టింది. మల్టీ లెవెల్ పద్ధతిలో ఏజెంట్లను నియమించుకొని ముంబై, ఢిల్లీ మహానగరంలోని అమాయకుల నుంచి 6,600 కోట్లు వసూలు చేసింది. ఈ వ్యవహారం బయటకి రావడంతో.. ఆ సంస్థకు సంబంధించిన ప్రమోటర్లపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ వ్యవహారంలో అమిత్ భరద్వాజ్ కీలకంగా వ్యవహరించారు. అమిత్ నుంచి శిల్ప భర్త రాజ్ 285 బిట్ కాయిన్లు తీసుకున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో తేలింది. ఈ బిట్ కాయిన్ల ద్వారా రాజ్ ఉక్రెయిన్ లో మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికీ ఈ కాయిన్లు అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్ అంచనా ప్రకారం వాటి విలువ 150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అటాచ్ చేశారు. దీంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం నెలకొంది.

Related Posts