
హైదరాబాద్, మార్చి 13,
తెలంగాణ పాలిటిక్స్లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ను..పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసినా గూడెం తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన గూడెం మహిపాల్రెడ్డికి పటాన్చెరులో పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట. లోకల్ కాంగ్రెస్ లీడర్లను గూడెం అసలు పట్టించుకోవడం లేదట. కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు. ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు. గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అంతేకాదు వివాహాలు, విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చాపాటిగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏదో కాంగ్రెస్లో చేరాను కానీ బీఆర్ఎస్లోనే ఉన్నానని అంటున్నారట గూడెం. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకొనే కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతున్నారు. కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి. ఇలా ఆయన మనసు బీఆర్ఎస్ వైపు లాగుతోందన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే గూడెం మహిపాల్రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు.ఆయనే కాదు మరొకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే..ఏకంగా తాను కాంగ్రెస్లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మధ్య అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు. దీంతో కృష్ణమోహన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారన్న ప్రచారం జరిగింది. ఆయనకు లోకల్గా జడ్పీ ఛైర్మన్ సరిత తిరుపతయ్యతో పొసగడం లేదట.మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉందట వ్యవహారం. సేమ్ టైమ్ సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపెడుతోందట. కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. చేరే వరకు ఎన్నో హామీలిచ్చి..ఇప్పుడు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. దాంతో కృష్ణమోహన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.మరో ఎమ్మెల్యే దానం నాగేందర్..ఆ పది మందిలో అందరి కంటే ముందే కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. హైడ్రా విషయంలో అయితే ఓపెన్గానే తన వైఖరేంటో చెప్తూ..కూల్చివేతలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు.రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు దానం. అల్లు అర్జున్ అరెస్ట్ను కూడా ఖండించారు. కేసీఆర్ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు దానం. కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న దానం తిరిగి బీఆర్ఎస్కు టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఫస్ట్ వేటు పడేది దానం మీదేనని అందరూ భావిస్తున్నారు. పైగా కాంగ్రెస్లోనే ఉంటే బైపోల్స్ వస్తే తనకు టికెట్ కూడా దక్కదని.. బీఆర్ఎస్లోకి వెళ్లడమే బెటర్ అనుకుంటున్నారట దానం. ఒకవేళ ఆయన వస్తానంటే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా లేదా అన్నదే పెద్ద క్వశ్చన్గా మారింది.కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ అదుర్స్ అనిపించినా..కంటిన్యూ అవడం కష్టంగా ఉందట. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదన్న అసంతృప్తి, మరోవైపు అనర్హత గుబులు..ఇంకోవైపు నియోజకవర్గంలో లోకల్ కాంగ్రెస్ లీడర్లతో పొసగక..ఏం చేయాలో అర్థం కావడం లేదట జంపింగ్ ఎమ్మెల్యేలకు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి కారు ఎక్కేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోందిమాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తన నియోజకవర్గానికి మంజూరు అయిన ఓ బ్రిడ్జికి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు క్యాన్సిల్ చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఆయన కూడా తిరిగి తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఏం జరగబోతోందో చూడాలి మరి.