
హైదరాబాద్, మార్చి 15,
అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని పార్టీ వర్గాలతో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి డుమ్మాకొట్టారు… రెండు సార్లు పవర్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన గులాబీ బాస్.. ఇప్పుడు ప్రతిపక్షనేత పాత్ర పోషించడానికి వెనకాడుతున్నారు .. గత బడ్జెట్ సమావేశాల్లో వ్యహరించినట్లు ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల బీఆర్ఎస్ వర్గాల ముందు ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.. దానికి తగ్గట్లేఅసెంబ్లీ సమావేశాల ముందు రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు..సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్….అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై తనపార్టీ సభ్యులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారంట.దాంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కేసీఆర్పైనే అందరి దృష్టి పడింది. అనుకున్నట్లే సభకు హాజరైన గులాబీబాస్ గవర్నర్ ప్రసంగం రోజున సభలో కనిపించారు. ఆరు నెలల తర్వాత సభకు వచ్చిన కేసీఆర్ …ప్రతిపక్ష నేత హోదాలో బీఏసీ సమావేశానికి హాజరుకాలేదు..రెండవరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగినా కేసీఆర్ డుమ్మా కొట్టడం చర్చినీయంశంగా మారింది. ఆ క్రమంలో సభా ప్రాంగణంలో ఎవరిని కదిపినా కేసీఆర్ అసెంబ్లీ హాజరుపైనే చర్చ నడుస్తుంది.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు.. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన అసలు అసెంబ్లీకే హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చి వెళ్లిన ఆయన గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక్క రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. ఆయన ఈ సారి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరై.. రెండోరోజు సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. అయితే ఈనెల 19న బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తమకు ఈ సారి అధికారం కట్టబట్టలేదనే కోపంతో కేసీఆర్ జనాలపై అలుగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గెలుపు ఓటములు సహజమని.. ఇప్పటి నుంచే ఆయన ప్రజా సమస్యలపై గళం విప్పితే.. జనం హర్షిస్తారని సూచిస్తున్నారు.ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ ను అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని…డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేవలం అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న భయంతో ఆరు నెలలకు ఒక సారి వచ్చి వెళ్లడం తప్ప .. ఆయనకు సభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే ఉద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ , అసెంబ్లీ సెక్రటరీకి హస్తం పార్టీ నేతలు ఫిర్యాదు చేసే వరకు వచ్చింది పరిస్థితి. ఆయినా ఆయన తిరిగి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం అటు పొలిటికల్ సర్కిల్స్తో పాటు పబ్లిక్లోనూ విమర్శలపాలవుతోంది.