
హైదరాబాద్, మార్చి 15,
రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు వుండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు ఏ పార్టీ వైపు మారుతారో చెప్పడం కష్టమే. అలా ఉన్నాయి రాజకీయాలు కూడా. కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. కాకపోతే తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ విజయశాంతి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమె పదవి అందుకున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మారిన రాజకీయాల నేపథ్యంలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్లో అడుగుపెట్టారు. స్టార్ క్యాంపెయిన్గా చాలా నియోజకవర్గాలను తిరిగారు. ఎమ్మల్యే కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది కాంగ్రెస్.రాములమ్మ సేవలు ఎమ్మెల్సీగా కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంలో విజయశాంతికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ఓ వార్త హంగామా చేస్తోంది. రేవంత్ కేబినెట్లో చోటు కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. కేబినెట్లోకి తీసుకున్న తర్వాత ఆమెకి ఏ పదవి ఇస్తారనే దానిపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది.రేవంత్ కేబినెట్లో దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిగా వాటిని భర్తీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పటివరకు పెండింగ్లో పడుతూ వస్తోంది. కేబినెట్ విస్తరణలో రాములమ్మతోపాటు మిగతా నేతలకు పదవులు ఇస్తారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని హైకమాండ్ లెక్కలు వేస్తోంది.ఏకగ్రీవంగా విజయశాంతి ఎన్నికైనట్టు ప్రకటించగానే గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చేశారు విజయశాంతి. బీజేపీతోపాటు బీఆర్ఎస్పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఏం చేసింది.. గతంలో కేసీఆర్ ఏమి చేశారు? మొత్తం గుట్టు విప్పి బయటపెట్టారు. ఈ రెండు పార్టీలకు తాను సేవలు అందించానని, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. తాను ఎమ్మెల్సీ అయినందుకు ఎందుకు బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ప్రస్తుతం రాములమ్మ వ్యవహారశైలిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆమె మాట్లాడిన ప్రతీ మాటను గమనిస్తున్నారు. గతంలో జరిగిన విషయాలు ఆమె బయట పెట్టడంతో ప్రస్తుతానికి ఆ పార్టీ నేతలు నోరు మెదపలేదు. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడున్న నేతల్లో కొంతమంది మాత్రమే తెలుసు.అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారట కేసీఆర్. దీనిపై ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. విజయశాంతికి ఏ విధంగా చెక్ పెట్టాలని దానిపై వ్యూహ రచన చేస్తున్నారట. ఆమెని కంట్రోల్ చేయకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది సీఎం రేవంత్రెడ్డి దూకుడుగా వెళ్లారు. సెకండ్ ఇయర్ రాములమ్మ వంతు కానుంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు కారు పార్టీ నేతలు. ఈమెని ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న రీసౌండ్ కారు పార్టీలో అప్పుడే మొదలైపోయింది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.