
వరంగల్, మార్చి 15,
వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖలు, అలాగే జీఎంఆర్ సంస్థ మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ముందుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదని జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉన్నప్పటికీ.. కేంద్రం, రాష్ట్రం జీఎంఆర్ సంస్థను ఒప్పించి మామునూరులో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నిర్ణయంతో పాటు.. మామునూరు నుంచి వర్దన్నపేట, ఐనవోలు మండలాల వరకు.. అలాగే కాజీపేట మండలంలోని ఉర్సుగుట్ట నుంచి భట్టుపల్లి ప్రాంతం వరకు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మరింత గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్, భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ముఖ్యంగా.. మామునూరు ప్రధాన రహదారికి అనుసంధానమయ్యే ప్రాంతాల్లో భూముల ధరలు గజానికి రూ.10,000 నుంచి రూ.11,000 మధ్య ఉంటే, ప్రస్తుతం ఆ ధరలు గజానికి రూ.22,000 నుంచి రూ.25,000 దాకా పెరిగాయి. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రాంతంలో ఎకరం భూమి దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య పలుకుతుండటం గమనార్హం.మామునూరు విమానాశ్రయం నిర్మాణంతో పాటు.. ఈ ప్రాంతంలో భవిష్యత్లో భూసేకరణ కార్యక్రమాలు కూడా వ్యాపార ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే.. గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ చేసి.. రూ.205 కోట్ల కేటాయింపులు చేసిన తర్వాత.. ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి.మామునూరు విమానాశ్రయ చరిత్రను మాట్లాడితే.. 1930లో నిజాం హయాంలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం.. వివిధ కారణాలతో 1980లో మూతపడింది. నిజాం కాలంలో 1,875 ఎకరాలు కేటాయించిన ఈ భూములలో.. తాజాగా 253 ఎకరాలు అదనంగా అవసరమవుతుందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో, మామునూరు మరియు దాని పరిసర ప్రాంతాలలో కనెక్టివిటీ పెరగడం మాత్రమే కాకుండా, పెద్ద పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఈ ప్రాంతానికి రాగలవు. దాంతో.. ఇక్కడ సాంకేతిక, వాణిజ్య, ఆర్థిక రంగాల్లో భారీ మార్పులు రావడం ఖాయం. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత, మామునూరు ప్రాంతం ఆదాయాన్ని పెంచుకోవడం, ఆదాయ మార్గాలు విస్తరించడం, అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రేరణ కాబోతుంది. ఇది కాకుండా.. భవిష్యత్లో పరిశ్రమలు, సాంకేతిక కేంద్రాలు, అలాగే ఎగుమతులు, దిగుమతులు కూడా పెరిగి.. ఇక్కడ వ్యాపార వాతావరణం మరింత పోటీగా మారనున్నాయి.