
హైదరాబాద్, మార్చి 17,
తెలంగాణలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే, డ్రైపోర్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. వికసిత్ భారత్ ప్రణాళికల్లో భాగంగా వీటిని నిర్మించనున్నారు. మనోహరాబాద్ ప్రాంతంలో డ్రైపోర్టు, హైదరాబాద్-బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కనుండగా.. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర అభివృద్ధిలో రహదారులదే కీలక పాత్ర కాబట్టి.. వాటి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరించటంతో పాటుగా.. కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇక భారత్ను సుసంపన్న దేశంగా నిలబెట్టడంలో డ్రైపోర్ట్లు, వాటి ట్రాన్స్పోర్టుకు రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా.. వికసిత్ భారత్-47 ప్రణాళికలను రాష్ట్రంలో అమలు చేస్తోంది.ఈ మేరకు హైదరాబాద్ సమీపంలో మనోహరాబాద్ వద్ద ఒక డ్రైపోర్ట్ నిర్మించాలని రాష్ట్రం డిసైడ్ అయింది. కేంద్రానికి రేవంత్ సర్కార్ ఇటీవల ప్రతిపాదనలు కూడా పంపించింది. అదే సమయంలో హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని బందర్పోర్ట్ వరకు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనను సైతం కేంద్రం ముందుంచింది. కేంద్రం నుంచి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు అనుమతి లభిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కొంత మెుత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వివిధ అవసరాల నిమిత్తం రూ.17 వేల కోట్లను అందించాల్సి రావొచ్చని కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది.