YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడిగడ్డ పాపాలు

మేడిగడ్డ పాపాలు

కరీంనగర్, మార్చి 24, 
మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్‌ సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్‌ పైల్స్‌ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని పేర్కొంది.ప్రైమరీ పైల్స్‌ వేసిన ఒకట్రెండు రోజుల్లో ఆర్‌సీసీ సీకెంట్‌ పైల్స్‌ వేయాల్సి ఉండగా.. నెల నుంచి నెలన్నర తర్వాత వేశారు. సీకెంట్‌ పైల్స్‌ ఎలా వేయాలన్నదానిపై నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ-పీఈఎస్‌ తమ అంతర్గత డాక్యుమెంట్‌నే అమలు చేయలేదు.నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఫీల్డ్‌ ఇంజినీర్లకు సీకెంట్‌ పైల్స్‌ గురించి అవగాహన లేదు. దీని మీద ఉన్నతస్థాయి ఇంజినీర్లు పర్యవేక్షణ చేయలేదు.సీడీవో ఆమోదించిన డ్రాయింగులను అమలు చేయలేదు. లోపభూయిష్ఠ నిర్మాణం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్‌ కింద పైపింగ్‌ ఏర్పడి గుంతలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే అంతిమంగా ఏడో బ్లాక్‌ కుంగింది.బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ చర్యలు కూడా కారణమని విజిలెన్స్ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడానికి కారణమైందని భావిస్తున్నారు. 2021 డ్యాం సేఫ్టీ చట్టం, పీడీపీపీ చట్టం-1984, పీసీ యాక్టు-1988, ఐపీసీలోని 120(బీ), 336, 409, 418, 423, 426 ప్రకారం సంస్థపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాకు స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసిన 17 మంది ఇంజినీర్లపైనా ఈ చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలని సూచించింది.ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఇంజనీర్లు చేశారు. పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వడం, బ్యారేజీకి మరమ్మతులు చేయకున్నా పట్టించుకోకపోవడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ కలిసి ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా కుట్ర చేసినట్లు స్పష్టమవుతోంది. పరిపాలనా అనుమతి ఇచ్చిన దానికన్నా డీవియేషన్‌ అదనంగా పెరిగితే 15 శాతం వరకు ప్రభుత్వానికి సమాచారమిచ్చి చీఫ్‌ ఇంజినీరే సవరించిన సాంకేతిక అనుమతి ఇవ్వొచ్చు. అయితే మొదటిసారి సవరించిన అంచనా ఆమోదం పొందకముందే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా చీఫ్‌ ఇంజినీర్‌ 15 శాతం డీవియేషన్‌కు ఆమోదం తెలిపారు. మొదట సవరించి ఇచ్చిన అంచనాలో ఉన్న కొన్ని పనులు చేయలేదు.అయితే అంచనాలో లేని పనులను చేసి బిల్లులు పొందారు. కొన్ని మంజూరు చేసిన క్వాంటిటీస్‌ కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారు. రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌కు చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదం తెలిపారు. 2018 జూన్‌ 23న రూ.3,260 కోట్ల సవరించిన అంచనాకు ఆమోదం రాగా, అంతకుముందే 2018 జూన్‌ 14న రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌ను చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదించారు. క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించి 1,88,257 క్యూబిక్‌ మీటర్ల టెస్ట్‌ రిజిస్టర్లు లేవు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయి.కాఫర్‌డ్యాం నిర్మాణానికి అంచనా వ్యయం తొలుత రూ.12.95 కోట్లు ఉండగా, 2018 జూన్‌ 23న మొదట సవరించిన అంచనాలో రూ.11.64 కోట్లకు తగ్గింది. రెండోసారి సవరించిన అంచనాలో రూ.61.21 కోట్లకు చేరింది. కాఫర్‌డ్యాంకు సంబంధించిన వివరాలు ఎక్కడా నమోదు చేయలేదు. విజిలెన్స్‌ రికార్డులు సీజ్‌ చేసే సమయంలో ఎంబీ-23, పేజీ-11లో పొందుపరిచారు. తర్వాత రికార్డు చేసిన 46,851 క్యూబిక్‌ మీటర్ల పనిని రద్దు చేశారు.బ్యారేజీ ప్రారంభం జరిగిన తర్వాత కాఫర్‌డ్యాం వ్యయాన్ని భారీగా పెంచి సవరించిన రెండో అంచనాను ఆమోదించడం నిధులను దుర్వినియోగం చేయడం, కాంట్రాక్టర్‌కు అయాచిత ప్రయోజనం కలిగించడానికేనని స్పష్టం చేసింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన లోపాలు, అక్రమాలకు కాంట్రాక్టు సంస్థ, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో బాధ్యులను చేస్తూ.. 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సజెస్ట్ చేసింది. సస్పెన్సన్ లాంటి చర్యలు సరిపోదని భావించింది. అడుగడుగునా ఆ ఇంజనీర్ల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉందని గుర్తించింది. అందుకే వారిపై ఏకంగా క్రిమినల్ చర్యలకే సిఫార్సు చేయడం మామూలు విషయం కాదు.ఆ 17 మంది కాకుండా.. మరో 30 మందిపై డిపార్ట్‌మెంటల్ యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ఈ లిస్ట్‌లో కాళేశ్వరం మాజీ ENC నల్లా వెంకటేశ్వర్లు లాంటి టాప్ అధికారితో పాటు.. గతంలో SE స్థాయిలో పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉన్న తిరుపతిరావు తదితరులు ఉన్నారు. దోషులుగా తేలిన 30 మంది ఇంజనీర్లలో వేరు వేరు విభాగాలకు చెందిన DEEలు, AEEలు ఉన్నారు.మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీకి కారణమంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తప్పుబట్టిన ఆ 47 మంది ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే దానిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. కఠిన చర్యలకే మొగ్గు చూపాలా? వారి పదోన్నతులు ఆపేయాలా? ప్రభుత్వం సలహా తీసుకోవాలా? కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చే వరకు ఆగాలా? ఇలా రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.కేవలం ఇంజనీర్లపైనే కాదు.. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థపైనా యాక్షన్ తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూచించింది. అయితే, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటులో తమ తప్పేమీ లేదని L&T కంపెనీ మొదటినుంచీ వాదిస్తోంది. ప్లేస్ అండ్ ప్లాన్ డిసైడ్ చేసింది అప్పటి కేసీఆర్ సర్కారేనని.. తాము కేవలం నిర్మాణం మాత్రమే చేశామని చెప్పుకొస్తోంది. బ్యారేజీ నాణ్యతలో ఎలాంటి లోపం లేదని.. డిజైన్ ప్రాబ్లమ్ వల్లే బ్యారేజీ కుంగి ఉంటుందనేది ఎల్ అండ్ టీ వాదన. అందుకే, నిర్మాణ సంస్థ చెప్పినదాని ప్రకారమైనా.. విచారణలో బయటకు వస్తున్న విషయాల మేరకైనా.. మేడిగడ్డ డ్యామేజీలో పాపం అంతా కేసీఆర్‌దేనని స్పష్టమవుతోంది. ఎంక్వైరీ కంప్లీట్ అయితేగానీ అసలు దోషులెవరో తేలదు. ఆనాటి సర్కారు ఆడిచ్చినట్టూ ఆడిన అధికారులకు సైతం చిక్కులు తప్పట్లేదు.

Related Posts