
హైదరాబాద్, ఏప్రిల్ 17,
ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ తెలంగాణలో సరికొత్తగా భూభారతి వచ్చేసింది. ఇన్నాళ్లూ రైతుల సహనాన్ని పరీక్షించిన ధరణికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లుచీటి పలికింది. భూ హక్కుల నిర్వహణలో నవ శకాన్ని మొదలు పెట్టింది. రైతుల భూముల హక్కులకు భద్రత, భరోసా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా తెచ్చిన భూభారతి చట్టం చాలా లెక్కలకు పరిష్కారంగా వచ్చింది. ఉన్నది ఉన్నట్లు.. లెక్కలు పక్కాగా, సమస్యలు తీర్చేలా భూభారతి ఉండబోతోంది. ఇంతకీఒక్కటేమిటి.. ఇలా ఎన్నెన్నో అవకాశాలను, పారదర్శకతను తీసుకొస్తూ తెలంగాణలో భూ భారతి వచ్చేసింది. రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా కొత్త వ్యవస్థ వచ్చింది. ప్రతిదానికి కోర్టుల దాకా వెళ్లాల్సిన పని లేదు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ ఇలా స్టెప్ బై స్టెప్ పరిష్కార మార్గాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర లావాదేవీలన్నీ భూభారతి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి.గతంలో ధరణి పోర్టల్ అమలులోకి వచ్చినప్పుడు తలెత్తిన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు అర్థమయ్యేలా 33 మాడ్యూల్స్ను 6కు కుదించి యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ను రూపొందించారు. భూభారతి చట్టంలోని 23 అంశాలను దశలవారీగా అమలు చేయనున్నారు. మొదటి దశలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన అంశాలను అమలు చేస్తారు.పోర్టల్ నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా అన్నది తెలుసుకునేందుకు నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాల్లో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద స్టడీ చేస్తోంది. భూభారతి పోర్టల్ ద్వారా రైతులు భూమి రిజిస్ట్రేషన్, యజమాని పేరు మార్పు, వివాదాలపై అప్పీల్, రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పులు సరిచేయడం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు చేసుకోవచ్చు.అంతేకాకుండా భూమికి సంబంధించిన ఇతర సమాచారం, నిషిద్ధ భూముల వివరాలు, సర్వే నంబర్ లేదా పట్టాదారు పాస్బుక్ నంబర్తో భూమి హక్కుల గురించి తెలుసుకోవచ్చు. భూమి మార్కెట్ విలువ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, రిజిస్టర్డ్ పత్రాల సమాచారం, భూమి సంబంధిత ఫీజులు ఆన్లైన్లో చెల్లించే ఈ-చలాన్ సౌకర్యం కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది.హక్కుల రికార్డులో తప్పుల సవరణలతో పాటు అక్రమంగా పట్టాలైన ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు కొత్త ROR చట్టం మోక్షం కల్పించబోతోంది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఇంటి స్థలాలకు, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక హక్కుల రికార్డు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు భూసమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థను తీసుకురానున్నారు.భూ రికార్డుల్లో కీలకమైంది, సమస్యాత్మకమైందేంటంటే.. హక్కుల రికార్డులు, తప్పొప్పుల సవరణలే. దీన్ని తాజా చట్టంలో ఈజీ చేశారు. భూరికార్డుల్లో తమ వివరాలు తప్పుగా నమోదైనవారు, భూమి వివరాలు నమోదుకానివారు భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసి, సవరించుకోవచ్చు. చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి ఏడాదిలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తుదారు సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు పాస్ బుక్, టైటిల్ డీడ్, పహాణీ, ఇతర ఆధారాలను చూపాలి. అధికారులు ఆ భూమితో సంబంధం ఉన్నవారందరికీ నోటీసులు ఇస్తారు.ఎవరైనా వారంలో అభ్యంతరాలు రాతపూర్వకంగా అందించాలి. లేదంటే కేసు మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలు వస్తే విచారణ చేపట్టి 60 రోజుల్లో పరిష్కరిస్తారు. అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మీద నెక్ట్స్ తహసీల్దార్కు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీవోకు, ఆపై కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. వారు 30 రోజుల వ్యవధిలో సమాధానం ఇవ్వాలి.హక్కుల నమోదు అధికారి ప్రతి గ్రామంలోని అన్ని భూముల వివరాలతో హక్కుల రికార్డు తయారు చేసి, భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచాలి. ఆబాది, వ్యవసాయేతర భూముల కోసం ప్రత్యేక రిజిస్టర్ను గ్రామాల వారీగా తయారు చేసి భూభారతి పోర్టల్లో ఇచ్చిన ఫారంలో నమోదు చేయాలి. ఈ భూములపై సర్వే నిర్వహించి మ్యాప్ తయారు చేయాలి. ఇక వివాదాలు లేకుండా, ఆ భూమిపై పూర్తి హక్కులున్న వారికి తహసీల్దార్ తాత్కాలిక భూధార్ కార్డు జారీ చేస్తారు. తర్వాత సర్వే, మ్యాపింగ్ ప్రక్రియలు పూర్తి చేసి శాశ్వత భూధార్ కార్డు ఇస్తారు. ఇక హక్కుల వివరాలు అన్నీ సక్రమంగా ఉంటే.. దరఖాస్తు చేసుకున్నవారికి పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేస్తారు.భూముల క్రయవిక్రయదారులు భూ భారతి పోర్టల్లో స్లాట్బుక్ చేసుకుని.. వివరాలను నమోదు చేయాలి. స్లాట్ ఉన్న రోజున గిఫ్ట్ డీడ్, సేల్డీడ్, పాస్పుస్తకం, టైటిల్ డీడ్, సీసీఎల్ఏ ఇచ్చిన తేదీ నుంచి సర్వే మ్యాప్ తదితర అవసరమైన పత్రాలు అందజేయాలి. రిజిస్టార్ అవన్నీ పరిశీలించి.. హక్కుల రికార్డులోని వివరాలతో సరిపోల్చుతారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే రిజిస్ర్టేషన్ అయిపోతుంది.తహసీల్దార్ రికార్డులో కొనుగోలుదారు పేరు చేర్చుతారు. కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. ఇవే కాదు.. రైతులకు ఉచిత న్యాయ సహాయం, పాస్ బుక్ లలో భూమి పటం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు ట్యాంపర్ చేస్తే రద్దు చేసే అధికారం, భూమి హక్కులు ఏ రూపంలో వచ్చినా మ్యుటేషన్ చేసే వెసులుబాటు, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీలేట్ వ్యవస్థ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కు ముందు భూముల సర్వే ఇలాంటివెన్నో ఇప్పుడు భూభారతితో అందుబాటులోకి వచ్చాయి.కొత్త చట్టం ప్రకారం తప్పుల సవరణను ఎవరెవరు చేయాలనే దానిపై నిబంధనల్లో స్పష్టత ఇచ్చారు. మిస్సయిన సర్వే నంబర్ల నమోదు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణ కోసం సదరు భూముల మార్కెట్ విలువ 5లక్షలలోపు ఉంటే ఆర్డీవో స్థాయి అధికారి, ఆపై ఉంటే కలెక్టర్ సవరణ చేయాలి. డిజిటల్ సైన్ మిస్సింగ్ను ఆర్డీవో స్థాయి అధికారి సవరించవచ్చు. ఆస్తి ఏ తరహాదో నిర్ణయించే అధికారం, సవరించే అధికారం, పట్టాలో ఖాతా నంబర్ సవరించే అధికారం కలెక్టర్కు మాత్రమే అప్పగించారు.పేరులో తప్పులు వస్తే సవరించేందుకు.. పట్టా భూమి అయితే ఆర్డీవో, అసైన్డ్ భూమి అయితే కలెక్టర్కు అధికారం ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉండే భూముల విషయంలో కలెక్టర్కే అధికారం కల్పించారు. నాలా నుంచి వ్యవసాయ భూమిగా సవరణ చేసేందుకు.. చదరపు గజాల్లో విక్రయించే పార్ట్ ల్యాండ్స్ విషయంలో అధికారాలను ఆర్డీవోకు కల్పించారు.