
విజయవాడ, ఏప్రిల్ 26,
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని.. ఇప్పటి వరకు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మరింత డెవలప్ చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్రయత్నాలుచేస్తోంది. దీనిలో భాగంగా.. రాజధానిని జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన జాతీయ రహదారులతో రాజదానిని అనుసంధానించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తయితే.. అమరావతి.. అందరిదీ అనే భావనను మరింత పెంచి.. దీనిని పొరుగు రాష్ట్రాలకు కూడా చేరువ చేయనున్నారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవారిని ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలోనే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి మరో 30-40 వేల ఎకరాల భూమిని సేకరించే దిశగా అడుగులు వేసింది. ఇది పూర్తయ్యేందుకు రెండేళ్ళ గరిష్ఠ సమయాన్ని నిర్దేశించుకుంది. ఇక, ఈ క్రమంలోనే రహదారుల విస్తరణకు కూడా.. కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా.. చెన్నై-కోల్కతా-హైదరాబాద్లతో రాజధానిని అనుసంధానించే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 2015-19 మధ్యే దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించినా.. వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. కానీ.. ఇప్పుడు దీనిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా.. రాజధానిని దేశవ్యాప్తంగా.. అన్ని ప్రాంతాలకు అనుసంధానించాలని నిర్ణయించింది. దీనిలో కీలకమైన మూడు రహదారులపై మాస్టర్ ప్లాన్రెడీ చేసుకుంది. ఎలివేటెడ్ కారిడార్-5, ఎలివేటెడ్ కారిడార్-13, నేషనల్ హైవే – 13లను నిర్మించి..వాటి ద్వారా హైదరాబాద్, చెన్నై, కోలకత వంటి నగరాలకు అమరావతిని కలుపుతారు.. తద్వారా.. దేశవ్యాప్తంగా రహదారి కనెక్టివిటీ మెరుగుపడుతుంది. పలువురుపెట్టుబడి దారులు.. కూడా..ఈ మార్గాలపై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించారు.
దీంతో ఈ విషయంపై తాజాగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.అదేసమయంలో కేంద్రానికి కూడా సమాచారం పంపించి.. ఆయారహదారుల నిర్మాణంపై క్లారిటీతీసుకుంటారు. దీంతో అమరావతి రాజధానిని జాతీయ ప్రాజెక్టుగా మరింత తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు.
పటేల్ తరహాలో
అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోని నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ బేస్లో ఎన్టీఆర్ జీవితం, కళాకృతులు, మినీ థియేటర్ తదితరాలు ఉండనున్నాయి. డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ కోసం టెండర్లు ఆహ్వానించారు. నందమూరి తారకరామారావు భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల కిందట మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించి వచ్చారు. ప్రాథమిక అంచనాల మేరకు 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో నీరుకొండ ఎత్తు 300 అడుగులు ఉంటుంది. దీని మీద 100 అడుగుల ఎత్తులో బేస్ను నిర్మిస్తారు. ఈ బేస్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుసుకునేలా కళాఖండాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి. ఈ బేస్ పైన 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.