YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో గట్టి నిఘా...

తిరుమలలో గట్టి నిఘా...

తిరుపతి, ఏప్రిల్ 26, 
జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితికి తోడు నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి భక్తుల భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలలో క్యాబ్‌లు నడుపుతున్న వారితో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. 400 మంది క్యాబ్ డ్రైవర్లు, 50 మంది యజమానులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. ఆలయ పరిసరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై వారికి అవగాహన కల్పించారు. తిరుమలలో భక్తుల భద్రతకు సంబంధించి డ్రైవర్లది కీలకమైన పాత్ర అని హర్షవర్ధన్ రాజు తెలిపారు.తిరుమలలో క్యాబ్‌లు, వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. నిషేధిత వస్తువులను ఎవరైనా తీసుకువచ్చినట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. తిరుమలలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. దొంగలు, నేరస్థులు తమ వాహనాలను ఎక్కినట్లు క్యాబ్ డ్రైవర్లు గుర్తిస్తే పోలీసులకు కానీ, డయల్‌ 112కు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. తిరుమలలో ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పనిచేయాలని.. తమ దృష్టికి ఎలాంటి అనుమానాస్పద సమాచారం వచ్చినా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు చొరబడితే ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై టీటీడీ సిబ్బందికి అవగాహన కల్పించారు. భక్తులను ఎలా రక్షించాలనే దానిపై తిరుమల లేపాక్షి స‌ర్కిల్ వద్ద ఉన్న సుద‌ర్శన్‌ స‌త్రంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌లో ఆక్టోప‌స్ కమాండోలు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు, ఏపీఎస్పీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితో పాటుగా సివిల్, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి వివరించారు.

Related Posts