
రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓ కుటుంబం(కేసీఆర్) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడదోసి తాము అధికారంలోకి వచ్చేందుకు ఆది నుంచి కుట్రలు పన్నిందని వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్పటికప్పుడు ప్రజల మద్దతుతో తాము ఆ కుట్రలను ఛేదిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. అందుకే.. ప్రతి చిన్న విషయాన్నీరాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేస్తుంటే.. దానిపైనా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజాగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రగనర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము గద్దె నెక్కిన ఆరు మాసాల్లోనే రైతులకు రుణ మాఫీ చేశామన్నారు. సుమారు లక్ష కోట్లకు పైగా సొమ్మును రైతులకు రుణ మాఫీ రూపంలో అందించామని చెప్పారు. గత పాలకులు పదేళ్లలో చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరు మాసాల్లోనే చేసి చూపిందని.. దీంతో వారి కడుపు మంట మరింత పెరుగుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్నికూల్చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శవ రాజకీయాలుచేస్తున్నారని బీఆర్ ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఎవరు ఏ విధంగా చనిపోయినా.. దానిని తమ ప్రభుత్వానికి అంటగడుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అయినా.. తమ ప్రభుత్వం ఎవరినీ చనిపోవాలని కోరుకోద న్నారు. రైతులకు సాధ్యమైనంత మేలు చేస్తున్నామని చెప్పారు. సర్పంచులను గత ప్రభుత్వం ఏడిపించిందని.. పోలీసులతో కేసులు పెట్టించిందని పేర్కొన్నారు. “గత సీఎం అందినకాడికల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. మేం వచ్చాక వాటిని సరిచేస్తున్నాం. ఇప్పుడు నెల నెలా జీతాలను టైం ప్రకారం ఇస్తున్నాం” అని తెలిపారు.
ఫోన్ట్యాపింగ్ విషయంపై స్పందిస్తూ.. గతంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఫోన్లు మాట్లాడుకున్నా.. భయపడే పరిస్థితికి తీసుకువచ్చార ని సీఎం రేవంత్ అన్నారు. చివరకు పడక గదిలో కూడా ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా చేశారని అన్నారు. ” అప్పట్లో ఫోన్ ట్యాపింగ్తో అరాచకం చేశారు. భార్యాభర్తలు కూడా ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అన్నీ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. విచారణకు పిలిస్తే.. అరెస్టు చేసి జైల్లో పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ.. ప్రజలు చూసే వారికి తగిన విదంగా బుద్ధి చెప్పారు.” అని రేవంత్ వ్యాఖ్యానించారు.