
విజయవాడ, ఏప్రిల్ 28,
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నాయకత్వ సమస్య ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తుంది. కేవలం టీడీపీ, జనసేనతో కలసి పోటీ చేయడం వల్లనే ఆ మాత్రం నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే. అంటే దీనికి ప్రధాన కారణం నాయకత్వ లేమి అని కేంద్ర నాయకత్వం కూడా నిర్ధారణకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి నుంచే కాదు.. తొలి నుంచి ఈ సమస్య ఉంది. టీడీపీతో జట్టుకడితేనే నాలుగు స్థానాలు సాధించి ఇటు శాసనసభలోనూ, అటు పార్లమెంటులోనూ కమలం పార్టీ అడుగు పెడుతుంది. పేరున్న నేతలున్నప్పటికీ వారు రాష్ట్ర స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలవారు ఎవరూ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని చెప్పకతప్పదు.ఎవరి ప్రభావం... గత ఎన్నికల్లో పురంద్రీశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ ఆమె ప్రభావం పనిచేసింది తక్కువేనని చెప్పాలి. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు పురంద్రీశ్వరి ఎన్టీఆర్ కుమార్తె అయినప్పటికీ విశాఖలో ఓటమి పాలయ్యారు. సో.. పురంద్రీశ్వరి అయినా... అంతకు ముందు సోము వీర్రాజు అయినా.. ఆ ముందు కన్నా లక్ష్మీనారాయణ అయినా పార్టీ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేయలేదు. అంటే వారికి అంతా సత్తా లేదు. మోదీ చరిష్మా కూడా ఏపీలో పెద్దగా పనిచేయకపోవడంతో ఇతర పార్టీల పైన ఆధారపడి గెలవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. సామాజికవర్గాల వారీగా, ఆస్తుల పరంగా చూసినా అంతే. ఏ మాత్రం పనిచేయదన్నది గత కొన్ని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు పురంద్రీశ్వరిని మార్చాలని కేంద్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఎవరికి ఇచ్చినా ఒరిగేదేమీ లేదన్న సంగతి తెలిసినా పార్టీని కొంతైనా ఊపు కలిగించేలా తీసుకెళ్లే నేత కోసం కేంద్ర నాయకత్వం అన్వేషిస్తుందని తెలిసింది. పురంద్రీశ్వరికి పదోన్నతి ఇచ్చి ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరిని నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. సుజనా చౌదరి అయితే ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయనకు పదవి ఇస్తే పార్టీ కార్యక్రమాలను విరివిగా నిర్వహించే అవకాశముందని ఆయనను ఎంపిక చేస్తారన్నది కూడా గత కొంతకాలంగా వినపడుతుంది. . కానీ పురంద్రీశ్వరి, సుజనా చౌదరి ఒకే సామాజికవర్గం కావడంతో ఈసారి బీసీలకు పదవి ఇవ్వాలని డిమాండ్ వినపడుతుంది. జనసేనలో కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ అధినేతగా ఉండగా, టీడీపీకి చంద్రబాబు ఉన్నారు. ఈ రెండు సామాజికవర్గాలు కాకుండా బీసీలకు అప్పగిస్తే ఆ ఓటు బ్యాంకును తెచ్చుకునేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. మరొకవైపు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం ఆలోచనలు మారుతుండటంతో చివరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్నది తేల్చరు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పార్టీ పదవి ఎవరికిస్తే ఆ సామాజికవర్గం కాకుండా వేరే సామాజికవర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నారన్న టాక్ బలంగా వినపడుతుంది.