
విశాఖపట్టణం, ఏప్రిల్ 28,
విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం ది భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని అంటూ విష్ణు కుమార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికీ తీసుకెల్లే సమయంలో మీరు అందుబాటులో లేరని.. గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విష్ణు కుమార్. ఓ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఆ సమయంలో గంటా కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే.. విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈ తతంగాన్ని మీడియా వీడియోలు తీసింది. గంటా శ్రీనివాసరావు మాత్రం వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని మరింత ఆగ్రహంతో స్పందించారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2014లో విశాఖ ఫిల్మ్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. సినిమా , సాంస్కృతిక కార్యకలాపాల ప్రభుత్వం నుండి భూమిని లీజుకు తీసుకుంది. ఈ భూమి విలువైన బీచ్ రోడ్డు ప్రాంతంలో ఉండటం వల్ల, దీనిపై రాజకీయ నాయకులు , వివిధ గ్రూపుల దృష్టి పడింది. వైఎస్ఆర్సీపీ హయాంలో క్లబ్ పాలకవర్గం మారిపోయింది. విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు నడిచాయని చెబుతారు. 2024 జూన్లో, క్లబ్లోని "వైఎస్ఆర్ లాన్స్" అనే పేరును క్లబ్ సభ్యులు తొలగించారు. గత వైసీపీ ప్రభుత్వం క్లబ్పై ఒత్తిడి చేసి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరుతో బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యను క్లబ్ సభ్యులు వ్యతిరేకించారు, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, ఈ పేరును తొలగించారు.ఈ క్లబ్ లీజు వ్యవహారంలో ఏం జరిగిందో కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం.. విష్ణుకుమార్ రాజు జోక్యాన్ని సహించలేదు. ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్లబ్ భీమిలి నియోజవర్గంలోకి రావడమే కాదు ఆ క్లబ్ ఏర్పాటులో గంటా శ్రీనివాసరావు కూడా కీలక పాత్ప పోషించారు. విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పినందున .. ఈ వ్యవహారంలో ఇంతటితో సద్దుమణిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.