
నెల్లూరు, ఏప్రిల్ 28,
నెల్లూరు టిడిపిలో అసంతృప్తులు ఉన్నాయా? సీనియర్లకు గౌరవం లభించడం లేదా? వైసీపీ నుంచి చేరిన వారి హవా కనిపిస్తోందా? సీనియర్ నేతల్లో అసంతృప్తికి అదే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో స్పష్టమైన హవా కనబరిచింది టిడిపి కూటమి. పదికి పది స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అండగా నిలిచిన జిల్లా.. యూటర్న్ తీసుకుంది. కనీసం ఉనికి చాటుకోలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది టిడిపి. ఆ పార్టీ సీనియర్లలో అసంతృప్తి ప్రారంభమైందన్న టాక్ వినిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా.. ఆ పార్టీకి అండగా నిలబడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం ఆయన కొనసాగుతూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్నారు. 2014లో సైతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచిన సోమిరెడ్డికి అవకాశం ఇవ్వలేదు. జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి లకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి.. సోమిరెడ్డి విషయంలో ఎటువంటి అవకాశం కల్పించలేదు.మరోవైపు జిల్లాలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట బాగా చెల్లుబాటు అవుతోంది. 2024 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు వేంరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో వేంరెడ్డి టిడిపిలోకి వచ్చారు. ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు టికెట్ ఇచ్చారు. వారిద్దరూ గెలవడంతో పాటు జిల్లాలో మిగతా అభ్యర్థుల గెలుపు కోసం పోరాటం చేశారు. జిల్లాలో పదికి పది సీట్లు రావడానికి వేం రెడ్డి కారణం. అందుకే చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే అది టిడిపి శ్రేణులకు మింగుడు పడడం లేదు.ఎన్నికల కు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు ఆనం రామనారాయణరెడ్డి. ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇంకోవైపు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మాట సైతం చెల్లుబాటు అవుతుంది. పనులు, నిధుల విషయంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. సహజంగానే ఇది టిడిపి సీనియర్లకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచామని వారు చెబుతున్నారు. కానీ తమను కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన వారికి ప్రాధాన్యం దక్కుతోందని వారు బాధపడుతున్నారు. అయితే ఈ అసంతృప్తి ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.