
హైదరాబాద్, ఏప్రిల్ 30,
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో టైంలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యామిలీ సినిమా చూడటానికి వెళ్లిన శ్రీతేజ్ ఫ్యామిలీ ఇరుక్కుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో తల్లి చనిపోయింది. తీవ్ర గాయాలు పాలైన శ్రీతేజ్ అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేశారు. దిల్సుఖ్నగర్కు చెందిన భాస్కర్, తన భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్కు వెళ్లారు. భారీగా జనం రావడం, అదే టైంలో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి అదే థియేటర్కు వచ్చాడు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి, కుమారుడు శ్రీతే చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో రేవతి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా... కొనఊపిరితో ఉన్న శ్రీతేజ్ను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలు పాలైన శ్రీతేజ్ను సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స అందించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శ్రీతేజ్ చావు అంచు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బాలుడిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. శ్రీతేజ్ను ఇంకా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆసుపత్రి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. అక్కడ పదిహేను రోజులు చికిత్స అందిస్తారు. అంటే ఫిజియోథెరపీ చేస్తారు. అనంతరం ఇంటికి పంపిస్తారు.తేజ్ కిమ్స్ లో మొత్తం 4 నెలల 25 రోజులు చికిత్స పొందాడు. దాదాపు 15 రోజుల క్రితం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి తేజ్ ను జనరల్ వార్డుకు తరలించారు. శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని, ఇన్ ఫెక్షన్లు లేవని వైద్యులు నిర్ధారించారు. అయితే, ఫిజియోథెరపీ, పునరావాస కేంద్రంలో నిరంతర సంరక్షణను సూచించారు. దాదాపు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ పొందిన తర్వాత ఇంటికి తీసుకెళ్లచని పేర్కొన్నారు.శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి పై ఆయన తండ్రి భాస్కర్ మాట్లాడారు. “తేజ్ కళ్ళు తెరిచాడు. మేము అతనికి ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ద్రవ పోషకాహారం అందిస్తున్నాము. అయితే, అతని మెదడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతను మనలో ఎవరినీ గుర్తించలేకపోతున్నాడు. ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండటంతో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని, పునరావాసం కోలుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు సూచించారు. శ్రీతేజ్కు జీవితాంతం సంరక్షణ అవసరం” అని భాస్కర్ చెప్పారు.. అయితే తన బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని కానీ తమను ఇంకా గుర్తు పట్టడం లేదని అంటున్నారు. తన చెల్లి ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతున్నా శ్రీతేజ్ స్పందించడం లేదని వాపోయారు. ఇంకా ఆసుపత్రిలో ఉంటే కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఫుడ్ తీసుకుంటున్నాడని అందుకే కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు చెప్పినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాలు తమకు డబ్బులు గురించి అడగలేదని డిశ్చార్జ్ టైంలో కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదని అన్నారు.